ఖమ్మం, మార్చి 4: తెలంగాణ సమాజ జాతిపిత సీఎం కేసీఆర్ అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేయగల ధీశాలి అని కొనియాడారు. కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న పథకాల వల్లే రాష్ట్రం నేడు ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంటుందని గుర్తుచేశారు. ‘మన ఊరు మన బడి’ కింద ఖమ్మంలోని 53వ డివిజన్ ఎన్ఎస్పీ క్యాంపు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ.57.38 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ‘మన ఊరు మన బడి’ కార్యక్రమ అమలులో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా ముందంజలో ఉండటం సంతోషకరమని అన్నారు. రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో 33 శాతం స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.960 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. ఖమ్మం జిల్లాలో చేపట్టిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మిగిలిన పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. తెలంగాణలోని ప్రతి బడికి, గుడికి మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇచ్చిన గొప్ప నేత కేసీఆర్ అని కొనియాడారు. పాఠశాల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో పాఠ్యపుస్తకాలను ఉచి తంగా ఇవ్వడం దేశంలో మరెక్కడా లేదని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ గౌతమ్, జడ్పీ చైర్మన్ కమల్రాజ్ తదితరులు పాల్గొన్నారు.