Mission Bhagiratha | సిద్దిపేట : మిషన్ భగీరథలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆరు జిల్లాల్లో మిషన్ భగీరథ నీళ్ల పంపిణీకి స్థిరీకరించేందుకు ఉపయోగపడే భారీ ప్రాజెక్టుకు ట్రయల్ రన్ నిర్వహించారు. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తరలించేందుకు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మంగోల్ వద్ద రూ.1,212 కోట్లతో నిర్మించిన రిజర్వాయర్ను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు ట్రయల్ రన్ ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా ఆరు జిల్లాల్లోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘనపూర్, ఆలేరు, భువనగిరి, మేడ్చల్(రింగురోడ్డు అవుట్ సైడ్) నియోజకవర్గాలకు తాగునీరు అందిస్తారు. గ్రామీణ ప్రాంతంలో ఒక వ్యక్తికి రోజుకు 100 లీటర్లు, మున్సిపాలిటీలో ఒక వ్యక్తికి 135 లీటర్లు అందించేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ అండ్ స్టోరేజీ (హెచ్ఎండబ్ల్యూఎస్)కు వెళ్లే నీటి నుంచి జనగామ, గజ్వేల్, ఆలేరు, భువనగిరి, మేడ్చల్ గ్రిడ్లకు తాగునీటిని అందిస్తున్నారు. 6 జిల్లాల పరిధిలోని 9 నియోజకవర్గాలకు ప్రస్తుతం ఉన్న సిస్టమ్ ద్వారానే గోదావరి జలాలను తరలించి మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని సరఫరా చేయనున్నారు.
మల్లన్నసాగర్ రిజర్వాయర్ సామర్థ్యం 50 టీఎంసీలు. ఇందులో నుంచి 9.06 టీఎంసీల నీటిని తాగడానికి సరఫరా చేయనున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మంగోల్లో మల్లన్నసాగర్ బండ్ 4.80 వద్ద ఓటీ స్లూయిస్ ఏర్పాటు చేసి ఇంటెక్వెల్ నిర్మించారు. ఇక్కడి నుంచి 5.6 కిలోమీటర్ల దూరంలో నీటి శుద్ధీకరణ ప్లాంట్ను నిర్మించారు. తొలుత జనగామ నియోజకవర్గంతో పాటు సిద్దిపేట మున్సిపాలిటీకి నీటిని సరఫరా చేయనున్నారు. మోటర్లు, పంపుల బిగింపుతో పాటు నీటిని తరలించేందుకు పైపుల పనులు పూర్తి చేశారు. మొత్తంగా 110 కిలోమీటర్ల పైప్లైన్ వేశారు.
ఇంటెక్వెల్ నుంచి 5.6 కిలోమీటర్ల దూరంలోని మంగోల్ శివారులో 540 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ ఫర్డే) సామర్థ్యంతో రెండు నీటి శుద్ధీకరణ ప్లాంట్ (ఒక్కోటి 270 ఎంఎల్డీ చొప్పున)లను నిర్మించారు. రిజర్వాయర్ నుంచి వచ్చిన నీరు మంగోల్ వద్ద శుద్ధ్ది అయ్యాక 3 కిలోమీటర్ల దూరంలోని లకుడారంలోని 6 ఎంఎల్ సామర్థ్యం కలిగిన గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(బీఎల్బీఆర్)లోకి వస్తాయి. ఇక్కడ మళ్లీ రెండు పాయింట్స్ ఏర్పాటు చేశారు. ఒకటి కొమురవెల్లి కమాన్, రెండోది అక్కారం. లకుడారం నుంచి కొమురవెల్లి కమాన్ వరకు 7.12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కమాన్ వద్ద ఉన్న ట్యాంక్లోకి నీటిని తరలిస్తారు. ఇక్కడి నుంచి జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాలకు తాగునీరు అందుతుంది. కొమురవెల్లి కమాన్ నుంచి మరో పాయింట్ ద్వారా 29 కిలోమీటర్ల దూరంలోని సిద్దిపేట నియోజకవర్గానికి నీటిని తరలిస్తారు. రెండో పాయింట్ లకుడారం నుంచి 16 కిలోమీటర్ల దూరంలోని అక్కారం వద్ద ఉన్న 6 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన సంపులోకి తరలిస్తారు.
ఇక్కడ నాలుగు పాయింట్లు ఏర్పాటు చేశారు. ఒక పాయింట్ నుంచి 33.6 కిలోమీటర్ల దూరంలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఘనపురం గుట్టకు నీటిని పంపింగ్ చేస్తారు. ఈ గుట్ట నుంచి మేడ్చల్, ఆలేరు, భువనగిరికి(ప్రస్తుతం ఉన్న పైప్లైన్ ద్వారానే) తాగునీటిని పంపిస్తారు. రెండో పాయింట్ 5.40 కిలోమీటర్ల దూరంలోని గజ్వేల్ కోమటిబండ లైన్కు కలుపుతారు. ఇక్కడి నుంచి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలతో పాటు మెదక్ జిల్లాలోని కొన్ని మండలాలకు జలాలు వెళ్తాయి. మూడో పాయింట్ నుంచి మల్లన్నసాగర్ నిర్వాసిత కుటుంబాల కోసం నిర్మించిన సంగాపూర్ ఆర్అండ్ఆర్ కాలనీకి నీటిని తరలిస్తారు. నాలుగో పాయింట్ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గానికి పంపింగ్ చేసేందుకు ప్రణాళిక సిద్ధ్దం చేశారు.