2,222 గ్రామాల్లో తాగునీటి
సరఫరా పునరుద్ధరణకు చర్యలు
వెల్లడించిన మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): భారీవర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 2,222 గ్రామాల్లో మిషన్ భగీరథ మంచినీటి సరఫరాకు ఆటంకం కలిగిందని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, నల్లగొండ, నిర్మల్ జిల్లాల్లో అంతరాయం ఏర్పడిందని వివరించారు. ఆయా గ్రామాల్లో మిషన్భగీరథ పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ఎదురవుతున్న పరిస్థితులపై బుధవారం ఆయన బంజారాహిల్స్లోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా దయాకర్రావు మాట్లాడుతూ.. వరదల కారణంగా రోడ్లకు జరిగిన నష్టంపై అంచనాలు సేకరించాలని, రహదారుల పునరుద్ధరణ, మరమ్మతుకు చర్యలు చేపట్టాలని సూచించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బంధీగా నిర్వహించాలని, సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశిచారు. జిల్లా పరిషత్తు సీఈవోలు, డీపీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, గ్రామ కార్యదర్శులను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, డైరెక్టర్ హనుమంతరావు, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి, పంచాయతీరాజ్ ఈఎన్సీ సంజీవరావు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా పరిస్థితులపై ఆరా
భారీ వర్షాల కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొన్న పరిస్థితిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్థానిక అధికారులతో ఆరా తీశారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. రోడ్డుపై ఒక అంగుళం కంటే ఎకువ ఎత్తుగా నీరు ప్రవహిస్తుంటే.. ముందు జాగ్రత్తగా ఆ రోడ్డును తాతాలికంగా బ్లాక్ చేయాలని కోరారు. ప్రజలు సైతం వర్షాలు తగ్గే వరకు ప్రయాణాలు పెట్టుకోవద్దని, రోడ్ల మీదకు రావద్దని విజ్ఞప్తి చేశారు.