హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం వెనుకాడబోదని రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. గురువారం శాసనసభ వ్యవహారాలపై అసెంబ్లీలో జరిగిన చర్చలో మంత్రి మాట్లాడారు. ప్రజాప్రతినిధుల ఆరోగ్య పరిరక్షణకు గతంలో ఉండే లక్ష పరిమితిని సీఎం తొలగించారని తెలిపారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో శాసన వ్యవస్థకు 51 కోట్లు కేటాయిస్తే.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సీఎం పెద్ద మనసుతో 168 కోట్లు ప్రతిపాదించారని వెల్లడించారు. మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్ సారథ్యంలో సభలు ఆదర్శప్రాయంగా సాగుతున్నాయన్నారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి న సమీకృత జిల్లా కలెక్టరేట్లు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్రెడ్డి, అరూరి రమేష్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. 19 నుంచి 54 ఎకరాల సువిశాల స్థలంలో రూ. 40 నుంచి 50 కోట్లు వెచ్చించి అత్యాధునిక హంగులతో జిల్లా కలెక్టరేట్లు నిర్మిస్తున్నామని, ఇప్పటికే 17 పూర్తి అయ్యాయని మరో 11 పురోగతిలో ఉన్నాయని వివరించారు. వరంగల్ కలెక్టరేట్ నిర్మాణాన్ని త్వరలో చేపడతామన్నారు. ఇటీవల ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి హాజరైన ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు అబ్బురపడి కొనియాడిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.