హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): నల్లగొండలో నేను రాజీనామా చేస్తా.. కేటీఆర్ సిరిసిల్లలో రాజీనామా చేయాలి.. ఆ తరాత ఇద్దరం సిరిసిల్లలో పోటీ చేద్దామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సవాల్ చేశారు. ఒకవేళ నేను సిరిసిల్లలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. మరి కేటీఆర్ ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీని మూసేస్తారా? అని ఆయన సవాల్ విసిరారు. శుక్రవారం సచివాలయంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్ మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘నేను సిరిసిల్లలో పోటీ చేసి గెలుస్తా.. మరి అక్కడ కేటీఆర్ ఓడిపోతే పార్టీ క్లోజ్ చేస్తారా?’.. అని ప్రశ్నించారు. ‘నాకు క్యారెక్టర్ ఉంది కానీ, డబ్బులు మాత్రం లేవు’.. అని చెప్పారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ధర్మపురి అరవింద్, బండి సంజయ్ తాము పెద్ద లీడర్లమని అనుకున్నారు కానీ ఎమ్మెల్యేగా కూడా గెలువలేదని ఎద్దేవా చేశారు. వీరిద్దరూ పొలిటికల్ లీడర్లు కాదని, గతంలో గాలిలో గెలిచారని ఎద్దేవా చేశారు. తమ ఉనికిని కాపాడుకునేందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతారని విమర్శించారు. నలుగురు బీజేపీ ఎంపీలు ఎప్పుడూ పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు తాను చూడలేదని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో తమకు ప్రత్యర్థి బీజేపీనే తప్ప బీఆర్ఎస్ కాదని చెప్పారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతున్నామని మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి తెలిపారు. రాహుల్గాంధీ నల్లగొండ, భువనగిరి.. ఈ రెండు స్థానాల్లో ఎక్కడి నుంచి పోటీ చేసినా నాలుగు లక్షలకుపైగా మెజారిటీ వచ్చే బాధ్యత తాము తీసుకుంటామని కోమటిరెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.