కందుకూరు, ఆగస్టు 6: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి బడుగుల జీవితాల్లో చైతన్యం రగలించిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జీవితం నేటి యువతకు ఆదర్శమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కొనియాడారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సర్వాయి పాపన్న విగ్రహాన్ని వారు ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ పాపన్న విగ్రహాన్ని ప్రభుత్వం త్వరలో ట్యాంక్బండ్పై ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. గీత వృత్తిదారుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నట్టు చెప్పారు.
వైన్ షాపుల్లో గౌడలకు 15 శాతం రిజర్వేషన్లు, ప్రభుత్వ స్థలాల్లో తాటి మొక్కలు నాటడం, రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం, పాపన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడం, నీరాకు ప్రోత్సాహం వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నటు వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, రాష్ట్ర గీత సహకార కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, బీజేపీ నేత తూళ్ల వీరేందర్గౌడ్, గౌడసంఘాల నేతలు రామారావు గౌడ్, వెంకన్నగౌడ్ తదితరులు పాల్టొన్నారు.