హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు త్వరలో మహబూబాబాద్ జిల్లాలో
పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీ భవనం, సమీకృత కలెక్టరేట్
కార్యాలయాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని సైతం
ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్రావు, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ శరత్ చంద్రపావర్తో కలిసి మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావు ఏర్పాట్లను పరిశీలించారు. మెడికల్ కాలేజీ, సమీకృత కలెక్టరేట్, టీఆర్ఎస్ కార్యాలయాల పనులను పరిశీలించారు. లక్ష మందితో బహిరంగ సభ నిర్వహించేందుకు ఇల్లందు రోడ్డు, సలార్ తండా ప్రాంతంలో స్థల పరిశీలన చేశారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పర్యటన కోసం జిల్లా ప్రజలు వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్నారన్నారు. సీఎం జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని, గిరిజనులు అత్యధికంగా నివసించే ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజీ నిర్మించడం నిరుపేదలకు వరలాంటిదన్నారు. సీఎం చేతుల మీదుగా వైద్య కళాశాల, సమీకృత కలెక్టరేట్కు త్వరలో ప్రారంభోత్సవం చేసుకోబోతున్నామన్నారు. జిల్లా ఏర్పాటు తర్వాత మహబూబాబాద్ జిల్లాగా ఏర్పాటుకావడంతో శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఎంతోకాలంగా పోడు వ్యవసాయం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న గిరిజన రైతులకు అటవీ హక్కుల పట్టాలు అందించేందుకు సీఎం స్వయంగా జిల్లాకు వచ్చి అందజేయనున్నారని తెలిపారు.