నాగర్కర్నూల్ : సమైక్య రాష్ట్రంలో గత పాలకులు దత్తత పేరిట ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలను దగా చేశారని..ఇక్కడి కరువును చూపించి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తీసుకువచ్చి సీమాంధ్రకు తరలించి వారు బాగుపడి తమను అన్యాయానికి గురి చేశారని మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఈ నెల 16వ తేదీన పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించి వందేళ్ల గోసను తీరుస్తున్నారని తెలిపారు.
పాలమూరు ప్రాజెక్టు ప్రారంభించనున్న తరుణంలో అనంతరం జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడాడుతూ..సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను గత పాలకులు ఏ మాత్రం పట్టించుకోలేదని ఫలితంగా 50 ఎకరాల భూమి ఉన్న రైతులతో పాటు రైతు కూలీలు ఇక్కడ ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడం వల్ల రివర్స్ మైగ్రేషన్ ప్రారంభమయ్యిందన్నారు.
ఇప్పుడు కాళేశ్వరం కంటే పెద్దవైన బాహుబలి మోటార్లను వాడి నీటిని తరలిస్తున్న పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా అన్ని చెరువులను నింపి ప్రతి ఎకరానికి సాగునీరు అందేలా చేస్తామని చెప్పారు. పాలమూరుపై ఇంచు ఇంచు అవగాహన ఉన్న సీఎం కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టు జూరాల నుంచి అయితే నష్టం జరుగుతుందని భావించి పుష్కలంగా నీరు అందుబాటులో ఉండే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తరలించేలా డిజైన్ చేసి మన అన్నదాతకు న్యాయం చేశారని అన్నారు. ప్రతి గ్రామం నుంచి రైతుబిడ్డలు, రైతుకూలీలు ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి తరలిరావాలని తహతహలాడుతున్నారని మంత్రులు పేర్కొన్నారు.
సమైక్య రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు, అధికారం అనుభవించిన నాయకులు అప్పుడు ఈ ప్రాంత ప్రజలకు కనీసం తాగునీరు ఇవ్వాలనే ఆలోచన కూడ చేయలేదని… వారు కూడా ఇప్పుడు ప్రాజెక్టుపై లేనిపోని మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పాలమూరు ప్రాజెక్టు ప్రారంభంతో పాటే కాలువలను కూడా వేగవంతంగా నిర్మించుకుంటామన్నారు.
ఇప్పటికే కాలువల టెండర్లు కూడా పూర్తవుతున్నాయని తెలిపారు. వలస జీవితాలకు పూర్తిగా స్వస్తి పలికేందుకు పాలమూరు ప్రాజెక్టు ఓ వరప్రదాయనిలా మారుతుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, కలెక్టర్ పి.ఉదయ్ కుమార్, ఐజీ షానవాజ్ ఖాసీం, తదితరులు ఉన్నారు.