Telangana Decade Celebrations | హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): నాడు ఎండిన చెరువులు.. నేడు నిండుకుండల్లా మారాయి. నాటి పాలకుల నిర్లక్ష్యంతో ఛిన్నాభిన్నమైన గొలుసుకట్టు చెరువులకు.. సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయతో పునరుజ్జీవం వచ్చింది. ప్రాజెక్టుల అనుసంధానంతో మండుటెండల్లోనూ చెరువులు మత్తడి దుంకుతున్నాయి. ఎర్రటి ఎండల్లోనూ నిండుకుండలను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్వహించిన చెరువుల పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. ప్రతి పల్లెలోనూ చెరువంత సంబురం కనిపించింది. పల్లెజనం సందడితో చెరువుగట్లు జనజాతరగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఊరిలోనూ చెరువులను విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. ఆడబిడ్డలు డప్పు చప్పుళ్ల నడుమ ఇంటికో బోనం, బతుకమ్మలతో కుటుంబ సమేతంగా చెరువుల వద్దకు ఊరిగేంపుగా తరిలారు. కట్ట మైసమ్మకు మొక్కులు చెల్లించుకొన్నారు. నిండుకుండల్లా ఉన్న చెరువుల వద్ద బతుకమ్మ ఆడారు. పలుచోట్ల పురుషులు కోలాటం ఆడుతూ సందడి చేశారు.
చెరువుల కట్ట వద్దే గ్రామస్తులతో ప్రజాప్రతినిధులు బంతి భోజనాలు చేశారు. సాయంత్రం 4 గంటలకు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం మిషన్కాకతీయ డాక్యుమెంటరీలను ప్రదర్శించారు. ప్రజాప్రతినిధులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. రైతులు, మత్స్యకారులు, గౌడకులస్తులు, మహిళలతో ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లో చెరువుల పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. మినీ ట్యాంక్బండ్గా తీర్చిదిద్దిన పాండవుల చెరువు వద్ద నిర్వహించిన కార్యక్రమానికి దాదాపు 1500 మందికిపైగా ప్రజలు తరలివచ్చారు. బోనాలు, బతుకమ్మలతో ఆడబిడ్డలు సంబురాలు చేసుకొన్నారు. ఈఎన్సీ హరిరాం, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావుదేశ్పాండే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మిషన్కాకతీయ గొప్పదనాన్ని, సాధించిన ఫలితాలను గ్రామస్తులకు వివరించారు.
చెరువుల పండుగలో మంత్రులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాన్సువాడ మండలం తాడ్కోల్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, వనపర్తిలో సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్రావు, నిర్మల్లో అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ధర్మపురి దమ్మన్నపేటలో కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ జిల్లాలోని చామన్పల్లిలో గంగుల కమలాకర్, నిజామాబాద్ జిల్లా పురాణిపేటలో వేముల ప్రశాంత్రెడ్డి, సిద్దిపేట కోమటిచెరువు వద్ద మంత్రి హరీశ్రావు, సూర్యాపేట పిల్లలమర్రి చెరువు వద్ద జగదీశ్రెడ్డి, ఖమ్మం లకారం చెరువువద్ద మంత్రి పువ్వాడ అజయ్కుమార్, నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత, సంగారెడ్డి కందిలో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శాంతికుమారి, చేవెళ్లలో సాగునీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీలు పాల్గొన్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో సంబురాలు అంబరాన్నంటాయి.
సిద్దిపేట, జూన్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ కృషితోనే మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులు బాగు చేసుకున్నామని, కోనసీమను తలదన్నేలా తెలంగాణను తయారుచేసుకొంటున్నామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్పేట గ్రామంలో చెరువుల పండుగలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, దశాబ్దాలుగా చెరువుల మట్టిలో చెదలను మిషన్ కాకతీయతో వదలించిన నాయకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. చెరువు అంటే బతుకు దెరువు అని.. చెరువు నిండుగా ఉంటే ఊరు సల్లగుంటదని చెప్పారు. మన మిషన్ కాకతీయ పథకాన్ని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ మెచ్చుకున్నారని, అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీ మిషన్ కాకతీయపై అధ్యయనం చేసిందని తెలిపారు. ఈ పథకాన్ని కేంద్ర సర్కారు అమృత్ సరోవర్ పేరుతో కాపీకొట్టిందని గుర్తుచేశారు. బీజేపీవాళ్లు ఢిల్లీలో మెచ్చుకొంటూ.. గల్లీలో తిడుతున్నారని దుయ్యబట్టారు. మన చెరువులు ఎప్పుడూ నిండు కుండలెక్క ఉండాలంటే సీఎం కేసీఆర్ను మళ్లీ మళ్లీ గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని చెరువులు గ్రామీణ ప్రాంతాల్లో కరువును శాశ్వతంగా తీర్చిన కల్పతరువుగా మారాయని, భూగర్భ జలమట్టాన్ని పెంచి నీటి సమస్య లేకుండా చేసేందుకు దోహదపడుతున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల్లో పూడికను తొలగించి కాళేశ్వరం జలాలతో వాటిని పునరుజ్జీవింపజేయడంతో.. పంట పొలాలకు సాగునీటితోపాటు కులవృత్తులకు పూర్వవైభవం వచ్చిందని చెప్పారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన చెరువుల పండుగను పురస్కరించుకొని ట్వీట్ చేశారు.
పదేళ్ల క్రితం..
ఏ చెరువును చూసినా గుండె బరువు
వాటిపై ఆధారపడిన కులవృత్తులకు లేదు బతుకుదెరువు
కానీ..
దశాబ్ది ఉత్సవాల వేళ
ప్రతి చెరువు..
కరువును శాశ్వతంగా తీర్చిన కల్పతరువు
చుక్కనీరు లేక చిక్కిశల్యమైన
అమ్మలాంటి ఊరి చెరువుకు
ఊపిరిపోసిన నాయకుడు..
గొలుసుకట్టు చెరువుల
గోస తీర్చిన పాలకుడు..
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు..
చెరువులకు పట్టిన
దశాబ్దాల శిలుమును
వదిలించిన విప్లవం పేరే
మిషన్ కాకతీయ
‘వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’
మెచ్చిన పథకమిది
‘మిచిగాన్ యూనివర్సిటీ’కి
నచ్చిన పథకమిది
గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు
ప్రాణం పోసిన తరుణమిది
పొలిమేరల్లో ఉన్న చెరువును
ప్రతి గుండెకు చేరువ చేసిన చరిత్ర ఇది.
అమృతోత్సవ వేళ
మన మిషన్ కాకతీయ
దేశానికే ఆదర్శమైంది..
‘తెలంగాణ మోడల్’
‘అమృత్ సరోవర్’ రూపంలో
దేశవ్యాప్తంగా ఆవిష్కృతమైంది.
మండువేసవిలో
మత్తడి దుంకుతున్న చెరువుల సాక్షిగా..
ఈ మహాయజ్ఞంలో
మనసుపెట్టి పనిచేసిన ప్రతిఒక్కరికి…
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా
చెరువుల పండుగ శుభాకాంక్షలు..
ఒక్క పథకం… ఫలితాలు అనేకం..
పూడిక మట్టితో పంటపొలాల్లో పెరిగిన సారం
గణనీయంగా పెరిగిన నీటి నిల్వ సామర్థ్యం-భూగర్భ జలమట్టం
చెరువులపై ఆధారపడ్డ కులవృత్తులకు పూర్వవైభవం
చెరువులకు జలకళ-మత్స్య పరిశ్రమకు మహర్దశ
జీవాలకు, పాడి పశువులకు తీరిన నీటి కొరత
పల్లెల్లో పెరిగిన పచ్చదనం-మారిన వాతావరణం
కాళేశ్వరం నీళ్లతో చెరువుల కడుపు నింపుతున్న రాష్ట్ర ప్రభుత్వం
మిషన్కాకతీయతో తెలంగాణలో చెరువులకు పునర్వైభవం వచ్చింది. నీటి పారుదల రంగంలో తెలంగాణ అసాధారం విజయాలు నమోదు చేసుకొన్నది. 380 కిలోమీటర్ల దూరం నుంచి సూర్యాపేట జిల్లాకు చేరుకున్న గోదావరి జలాలు ఇక్కడ జరుగుతున్న చెరువుల పండుగకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
– జగదీశ్రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి
చెరువులు బాగుంటే.. గ్రామాలు బాగుంటాయి..గ్రామాలు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి.. దీంతోనే రాష్ట్ర అభివృద్ధి సుసాధ్యమనే సంకల్పంతో సాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారు. స్వరాష్ట్రంలో 47 వేల చెరువులను రూ.5 వేల కోట్లతో మరమ్మతు చేయించారు. చెరువుల్లో నీటిని నింపేందుకు బృహత్తర ప్రణాళికలు రూపొందించారు. ఫలితంగా మండుటెండల్లోనూ చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. కేంద్ర సర్కారు అమృత్ సరోవర్ పేరుతో మన పథకాన్ని కాపీకొట్టినా అమలులో పూర్తిగా విఫలమయ్యింది.
-కల్వకుంట్ల కవిత, నిజామాబాద్ ఎమ్మెల్సీ
మిషన్ కాకతీయ పథకంతో రాష్ట్రంలోని 27 వేల చెరువులకు పునరుజ్జీవం వచ్చింది. నాడు..గుర్రపు డెక్క, పరిగి కంపతో నిండిపోయిన చెరువులు.. నేడు నిండానీళ్లతో కళకళలాడుతున్నాయి. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో మహేశ్వరం నియోజకవర్గంలో గొలుసుకట్టు చెరువులను బాగుచేసుకున్నాం. ఇప్పుడవి మండుటెండల్లోనూ జలకళను సంతరించుకొన్నాయి.
– సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
తెలంగాణ రాకముందు చెరువుల పరిస్థితి ఘోరంగా ఉండేది. మిషన్ కాకతీయతో పూడిక తీసి, తూములను బాగు చేయడంతోపాటు కట్టలను బలోపేతం చేశాం. మండుటెండల్లోనూ చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. సీఎం కేసీఆర్ సంకల్పంతో గోదావరి మన చెరువులకు నడిచివచ్చింది.
-మల్లారెడ్డి, కార్మికశాఖ మంత్రి
స్వరాష్ట్రంలోనే నీలి విప్లవం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మిషన్ కాకతీయతో రాష్ట్రంలోని చెరువులన్నింటినీ పునరుద్ధరించుకొన్నం. చెక్డ్యాములు కట్టుకొన్నం. ఫలితంగా మన చెరువులన్నీ జలకళను సంతరించుకొన్నాయి. చెరువుల్లో ఉచితంగా చేపపిల్లలు వదిలి, మత్స్యకారులకు ఉపాధి చూపినం.
– అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి
కాకతీయుల కాలంలో నిర్మించిన వేలాది చెరువులు సమైక్య పాలనలో శిథిలమైపోయాయి. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ దూరదృష్టితో మిషన్ కాకతీయ పథకానికి రూపకల్పన చేశారు. చెరువుల్లో పూడికతీయడంతోపాటు మరమ్మతులు చేయించడంతో సాగునీటి సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాయి. మిషన్ కాకతీయవల్ల మండుటెండల్లోనూ చెరువులు మత్తడి దుంకుతున్నాయి.
-తలసాని శ్రీనివాస్యాదవ్, పశుసంవర్ధకశాఖ మంత్రి
కేసీఆర్ ప్రభుత్వం రైతాంగానికి చేస్తున్న మేలు దేశంలోని మరే ప్రభుత్వం చేయడం లేదు. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన చెరువులు నీళ్లు లేక బీటలు వారి కనిపించేవి. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ దార్శనికతతో రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల చెరువులు పునరుద్ధరణకు నోచుకొన్నాయి. దాని ఫలితంగానే ఎండాకాలంలోనూ చెరువులు జలకళ సంతరించుకొన్నాయి. అలుగులు పారుతున్నాయి.
-వేముల ప్రశాంత్రెడ్డి, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి
కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రూ.6 వేల కోట్లతో 46 వేల చెరువులకు పూర్వవైభవం తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. ఎక్కడైతే నీటి సౌకర్య ఉంటుందో అ ప్రాంతం ఎప్పుడూ సుభిక్షంగా ఉంటుంది. సీఎం కేసీఆర్ కూడా దీన్నే ఆచరణలో పెట్టారు. చెరువులను బాగుపరిచి, సాగునీటి గోస తీర్చారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. 70 ఏండ్లు పాలించిన ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం తొమ్మిదేండ్లలోనే చేసి చూపించారు.
-పోచారం శ్రీనివాస్రెడ్డి, స్పీకర్
స్వరాష్ట్రంలో మిషన్ కాకతీయతో చెరువులకు జీవం పోసి సాగునీటి సమస్యను అధిగమించాం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో నీటిపారుదల రంగంలో ఊహించని ప్రగతి సాధించాం. మిషన్ కాకతీయతో తెలంగాణకు ఆయువు పట్టయిన చెరువులను పునరుద్ధరించి, రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్నపూర్ణగా మార్చారు. చెరువుల పునరుద్ధరణ వల్ల 265 టీఎంసీల నీటిని నిల్వ చేశాం. మండుటెండల్లోనూ చెరువులు మత్తడి దుంకుతున్నాయంటే ఆ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది.
-కొప్పుల ఈశ్వర్, సంక్షేమ శాఖ మంత్రి
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో నీలి విప్లవం ఏర్పడి మత్స్యకారులు ఆర్థికాభివృద్ధి సాధించారు. మిషన్ కాకతీయతో చెరువులకు పునర్జీవం వచ్చింది. ఎత్తిపోతల నుంచి కృష్ణమ్మ పరుగులు పెడుతుండటంతో ప్రతి చెరువు, కుంట జలకళను సంతరించుకొన్నాయి. దీంతో మత్స్యసంపద గణనీయంగా పెరిగింది.
-సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
సమైక్య పాలకులు చెరువులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేస్తే.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ ద్వారా వాటికి పూర్వవైభవం తీసుకొచ్చారు. నాడు ఎండాకాలంలో చుక్కనీరు కనిపించని చెరువులు.. నేడు నిండా నీటితో కళకళలాడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.179 కోట్లతో 601 చెరువులను బాగుచేసుకొన్నం. దీంతో పంటల సాగుబడి, దిగుబడి గణనీయంగా పెరిగింది.
-ఎర్రబెల్లి దయాకర్రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి
స్వరాష్ట్రంలో మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం వచ్చింది. తెలంగాణ ప్రజలకు చెరువులే ఆదెరువుగా మారాయి. సమైక్య పాలనలో చిక్కిశల్యమైన చెరువులను గుర్తించి.. స్వరాష్ట్రంలో మిషన్ కాకతీయతో సీఎం కేసీఆర్ వాటిని పునరుద్ధరించారు. ప్రాజెక్టుల అనుసంధానంతో చెరువులను నిండుకుండల్లా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుంది.
– పువ్వాడ అజయ్కుమార్, రవాణా శాఖ మంత్రి
సమైక్య రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువులను పట్టించుకొన్న నాథుడే కరువు. కానీ.. స్వరాష్ట్రంలో గొలుసుకట్టు చెరువులకు సీఎం కేసీఆర్ జీవంపోస్తున్నారు. 23 ఏండ్ల క్రితం ఉద్యమ సమయంలో కేసీఆర్ ములుగు జిల్లాలో పర్యటించిన సందర్భంగా చెరువు కట్టలు ఎక్కి పరిశీలించారు. అప్పుడే చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకొన్నారు. ప్రణాళికలు రచించారు. మిషన్ కాకతీయ పథకాన్ని రూపొందించారు. ప్రతి గ్రామానికి నీళ్లు అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం. మండే ఎండల్లోనూ చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయంటే.. అది సీఎం కేసీఆర్ ఘనతే.
-బీ వినోద్కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన చెరువులకు.. తెలంగాణలోనే జలకళ వచ్చింది. మిషన్ కాకతీయ పథకంతో చెరువులకు పునరుజ్జీవం లభించింది. సీఎం కేసీఆర్ సంకల్పంతో చెరువులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి.
-గంగుల కమలాకర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి
స్వరాష్ట్రంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాలు పెరిగాయి. సాగు నీటి రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. వరి దిగుబడిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.
– గుత్తా సుఖేందర్రెడ్డి, మండలి చైర్మన్