హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు సంబురంగా సాగుతున్నాయి. పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి. బుధవారం జరిగిన ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, శ్రీనివాస్గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, విప్ గువ్వల బాలరాజు, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఆత్మీయ సమ్మేళనాల ఇన్చార్జీలు పాల్గొని పార్టీ శ్రేణులకు భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ మండలంలోని చింతలపల్లి, సోమారంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తన సతీమణి ఉషాదయాకర్తో కలిసి వంటలు చేశారు. కార్యకర్తలతోనే కింద కూర్చొని భోజనాలు చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని హైటెక్ గార్డెన్స్లో మహబూబ్నగర్ రూరల్ మండల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలని పార్టీశ్రేణులకు సూచించారు. మంత్రి సమక్షంలో మహబూబ్నగర్ రూరల్ మండలానికి చెందిన 100 మంది నాయకులు బీఆర్ఎస్లో చేరారు. రంగారెడ్డి జిల్లా జల్పల్లి ముపల్లి మున్సిపాలిటీలోని శ్రీరామకాలనీలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే మహనీయుడు సీఎం కేసీఆర్ అని, ఆయనను కంటికి రెప్పలా కాపాడుకుందామని కార్యకర్తలకు చెప్పారు. పూలవర్షం కురిపిస్తూ డప్పువాయిద్యాలతో ఆత్మీయ సమ్మేళనం కోలాహలంగా సాగింది. హైదరాబాద్లోని సనత్ నగర్ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదలకు అండగా గులాబీ జెండా ఉన్నదని, ఆ జెండాను పట్టుకున్న కార్యకర్తలు అదృష్టవంతులని అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉన్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఆత్మీయ సమ్మేళనాల ఇన్చార్జి దాసోజు శ్రవణ్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ పాల్గొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ పాల్గొని మాట్లాడారు. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు ముందుకు సాగుతున్నదని చెప్పారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తల శ్రమ, కృషిని విస్మరించబోమని స్పష్టం చేశారు.