పెద్దపల్లి, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణలో రైతు ఆత్మహత్యలకు సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు కారణం. మేడిగడ్డ కుంగిన చోట రింగ్బండ్, ఇసుక బస్తాలు వేసి నీళ్లు ఎత్తిపోయవచ్చు. సాగు నీటి కష్టాలను తీర్చవచ్చు. కావాలనే బరాజ్లోని నీటిని దిగువకు వదిలి పంటలను ఎండబెట్టిన్రు. రైతుల నోట్లో మట్టికొట్టారు’ అని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ మండిపడ్డారు. ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు వరకు సాగునీరిస్తామని సర్క్యూలర్ జారీ చేసి, షెడ్యూల్ ఇచ్చి నీరు ఇవ్వకుండా మోసం చేశారని, ఈ విషయమై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.
బుధవారం పెద్దపల్లిలోని బీఆర్ఎస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఏ ఊళ్లో చూసినా రైతులు పంట పొలాల్లో కూర్చొని ఏడుస్తున్నారని, పంటలు ఎండబెట్టిన పాపం కాంగ్రెస్ సర్కారుదేనని దుయ్యబట్టారు. గత ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందోనని, సీఎం రేవంత్రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిన పిల్లర్లను సాకుగా చూపి నీళ్లివ్వకుండా రైతు ఆత్మహత్యలకు కారణమవుతున్నారని మండిపడ్డారు. పెద్ద చెరువులు, డ్యాంలు కావచ్చు చిన్న గండి పడితే ఇసుక సంచులు వేసుకొని నీళ్లు ఆపుకొన్న సందర్భాలు తెలంగాణలో అనేకం ఉన్నాయని తెలిపారు. కాళేశ్వరానికి మేడిగడ్డనే వెన్నముక అని రేవంత్ మాట్లాడిన మాటలను మీడియాకు వినిపించారు. అదే నిజమైతే ఆ వెన్నముక మొత్తం పాడైనా నిలబెట్టి, నడిపించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నదని అన్నారు. అలాంటి టెక్నాలజీని వాడి బాగు చేయవచ్చు కదా? అని ప్రశ్నించారు. వెన్నెముక మొత్తం విరిగి పోలేదని ఒక్క పిల్లర్ మాత్రమే కుంగిందని, దాని చుట్టూ ఇసుక బస్తాలతో రింగ్ బండ్ వేసి నీళ్లను నిలుపవచ్చని సూచించారు.