భీంగల్: తెలంగాణ అన్ని కులాలు, మతాల సమ్మిళితమని, అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖామంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధి భీంగల్ పట్టణ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున గురువారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ ఇలా అన్ని మతాల పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ముస్లిం మైనార్టీలను అన్నిరకాలుగా ఆదుకుంటున్నది కేసీఆర్ సర్కారు మాత్రమేనన్నారు. ముస్లిం ఇండ్లల్లో నిరుపేద ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా షాదీముబారక్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం 204 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పారని గుర్తు చేశారు. ఒక్కో పాఠశాలలో 400 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, ఒక్కో విద్యార్థి మీద లక్షా 25 వేల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని తెలిపారు.