హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ వాపును చూసి బలుపనుకుంటున్నదని, కర్ణాటక గెలుపుతో తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం అయ్యిందని ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారని మం త్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. బా లొండ నియోజకవర్గం భీమ్గల్ మండలంలోని భీమ్గల్, ముచూర్, బాబాపూర్ గ్రామాల నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, యువకులు హైదరాబాద్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మంత్రి ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కంటే 10 ఏండ్ల ముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నదని , రైతులు, పేదల కోసం ఏం చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసని ఎద్దేవా చేసారు. బీజేపీ అంటేనే బడా జూటా పార్టీ అని విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మొదలుకొని రాష్ట్రంలోని బీజేపీ మండల అధ్యక్షుడి వరకు నోరు తెరిస్తే అబద్ధాలు, అసత్యాలే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణపై మోదీ సర్కారు వివక్ష చూపుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ ఎంపీలకు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పట్టవని పేర్కొన్నారు.
బాలొండ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అన్ని విధా లా అభివృద్ది చేసుకున్నామని, బాలొండ అభివృద్ధి పరంపరను ఎవరూ ఆపలేరని మంత్రి వేముల స్పష్టం చేశారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవనం, 21 ప్యాకేజీ, మిషన్ కాకతీయ, చెక్ డ్యాంల నిర్మాణం సాగునీటి రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించామని పేర్కొన్నారు. బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, వాగుల మీద బ్రిడ్జిలు, అన్ని మండల కేంద్రాల్లో రోడ్ల వెడల్పు, సెంట్రల్ లైటింగ్.. ఇలా వందల కోట్లతో ఎన్నో పనులు చేసుకొంటున్నామని వివరించారు. తాను నియోజకవర్గ అభివృద్ధి కోసం తాపత్రయపడుతుంటే ప్రతిపక్షాలు ప్రెస్మీట్లు పెట్టి బురదజల్లుతున్నాయని మండిపడ్డా రు. తనపై ఎన్ని అసత్య ఆరోపణలు సృష్టి సే.. అంతకు రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తానని స్పష్టం చేశారు. కాగా, భీమ్గల్ నుంచి కాంగ్రెస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు, జిల్లా పార్టీ కార్యదర్శి కర్నె సత్య గం గయ్య, బీజేపీ నేత మాసం మధు, చింతకుంట సాయి, ముచూర్ గ్రామం నుంచి బిసిరి బాలకృష్ణ, బాబాపూర్ కాంగ్రెస్ మా జీ ఉప సర్పంచ్ ధరణికోట అశోక్తోపాటు సుమా రు 50 మంది వరకు మంత్రి ప్రశాంత్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మధుశేఖర్, రాజారాంయాదవ్, భీ మ్గల్ మండల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.