భీమ్గల్, మార్చి 19: మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి ఎమ్మెల్సీ కవితను ఈడీ, సీబీఐ విచారణ పేరుతో వేధిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బడాభీమ్గల్ గ్రామంలో రూ.7.77 కోట్లతో నిర్మించిన 112 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాన్ని (కేసీఆర్ కాలనీ) ఆదివారం మంత్రి ప్రారంభించారు.
లబ్ధిదారులకు ఇంటి పత్రాలను అందజేసి, వారితో గృహ ప్రవేశం చే యించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ను మోదీ రాజకీయంగా ఎదుర్కోలేక దర్యాప్తు సంస్థలతో అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. లక్షల కోట్ల ప్రజా ధనాన్ని కాజేసిన అదానీపై చర్యలెందుకు తీసుకోవడం లేదని మంత్రి ప్రశ్నించారు. తామందరం కవితమ్మకు అండగా నిలబడాలని, చేతులెత్తి మద్దతు తెలుపాలని కోరగా.. సభలోని మహిళలు, ప్రజలు ఒక్కసారిగా నినాదాలు చేస్తూ చప్పట్లు కొట్టి, చేతులెత్తి కవితమ్మకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.