హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): దేశ సంపద దోపిడీదారుగా ప్రధాని నరేంద్ర మోదీ మారారని, ఆ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. అలాంటి వ్యక్తి అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని విమర్శించారు. ప్రధాని అనే హోదాను మర్చి ఫక్తు రాజకీయ ఆరోపణలు చేశారని ఫైరయ్యారు. శనివారం వరంగల్లో ప్రధాని చేసిన వ్యాఖ్యలను మంత్రి ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ.. ఇప్పటి వరకు ఎన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలని, శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. మెడికల్ కాలేజీలు, నవోదయ పాఠశాలలు, ట్రిపుల్ ఐటీలు, మిషన్ భగీరథకు నిధులు, కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా, మెట్రో రైల్ కోసం నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేసీఆర్ను తిట్టడానికే మోదీ వచ్చినట్టు ఉన్నదని మండిపడ్డారు.