నిజామాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీయాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ కప్-2023 (CM cup-2023) క్రీడా పోటీలను నిర్వహిస్తున్నదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashanth reddy) అన్నారు. నిజామాబాద్లోని పోలీస్ పరేడ్ మైదానంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీఎం కప్ – 2023 జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, వారు ప్రతిభను చాటుకునేందుకు వీలుగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) దృష్టి ఎల్లప్పుడూ గ్రామీణ ప్రాంత ప్రజల అభ్యున్నతిపైనే కేంద్రీకృతమై ఉంటుందన్నారు.
ఇందులో భాగంగానే గ్రామీణ ప్రాంత క్రీడాకారుల కోసం ప్రతి గ్రామ పంచాయతీలో, పట్టణ ప్రాంతాల్లోని అన్ని వార్డుల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటుచేశారని వెల్లడించారు. వీటిని సద్వినియోగం చేసుకుని గ్రామీణ ప్రాంత విద్యార్థులు, యువత క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. జిల్లా నుంచి మలావత్ పూర్ణతోపాటు నిఖత్ జరీన్, యెండల సౌందర్య, గుగులోత్ సౌమ్య, హుసాముద్దీన్, ఇషాసింగ్ వంటి అనేక మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. క్రీడల నిర్వహణకు సహకరిస్తున్న పీడీలు, పీఈటీలను అభినందించారు.
ఆరోగ్య పరిరక్షణకు, మానసికోల్లాసానికి ఎంతగానో దోహదపడే క్రీడలను ప్రతి ఒక్కరు అలవాటుగా మార్చుకోవాలని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిన వారు నిరాశ చెందకుండా గెలుపొందిన వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. సీఎం కప్-2023 పోటీల్లో క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ఈ నెల 15, 16, 17వ తేదీల్లో మండల స్థాయిలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు ప్రస్తుతం జిల్లా స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ నెల 28 నుండి 31 వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో జరుగనున్న పోటీల్లోనూ జిల్లాకు చెందిన క్రీడాకారులు తమ ప్రతిభను చూపాలన్నారు.