నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 4: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పోడు భూములపై హక్కు కల్పిస్తూ ఏక కాలంలో 4.60 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు అందించి 1.50 లక్షల మంది గిరిజన కుటుంబాలకు భరోసా కల్పించిన ఏకైక సీఎం కేసీఆర్ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కొనియాడారు. పట్టాల పంపిణీతో గిరిజనులు ఇక నుంచి దర్జాగా వ్యవసాయం చేసుకుంటారని తెలిపారు. మంగళవారం నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లో నిర్వహించిన పోడు పట్టాల పంపిణీలో మంత్రులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం తాళ్లపల్లిలో కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతుతో కలిసి మంత్రి వేముల 1,011 గిరిజన కుటుంబాలకు పోడు పట్టా లు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి వేముల మాట్లాడుతూ.. జిల్లాలో 8,600 ఎకరాల పోడు భూములకు 4,300 మందికి పట్టాలను ఇస్తున్నామని చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కలెక్టర్ యాస్మీన్ బాషాతో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్ పోడు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. పోడు పట్టాలు పొందిన రైతులకు కూడా రైతుబంధు, రైతు బీమా, బ్యాంకు ద్వారా లోన్లు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని గుర్తు చేశారు. పట్టాలు అందజేసి గిరిజనులను భూములకు యజమానులను చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. ఎన్నికల ముందు కొందరు మోసగాళ్లు వస్తున్నారని, ప్రజా సేవకులు ఎవరో.. మోసగాళ్లు ఎవరో గిరిజనులు గుర్తించాలని మంత్రి కోరారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ వేదికగా ఐటీడీఏ పరిధిలోని గిరిజన గ్రామాల ప్రజలు సాగు చేసుకుంటున్న భూములకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పోడు పట్టాలు పంపిణీ చేశారు. అంతకుముందు కుమ్రంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ కావాలంటే.. తామందరం సీఎం కేసీఆర్ వెంట నడవాలని సూచించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర, సత్తుపల్లి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ వీపీ గౌత మ్, డీఎఫ్వో విక్రమ్ సిద్ధార్థ్సింగ్, ఐటీడీ పీవో పొట్రు గౌతమ్తో కలిసి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పోడు పట్టాలు పంపిణీ చేశారు.