వేల్పూర్: కేంద్రం తన బాధ్యత విస్మరించినా.. రైతుకు నష్టం కాకూడదని సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ వరి ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం దోబూచులాడుతున్నదని విమర్శించారు. బీజేపీ సర్కారు తీరును ముందే పసిగట్టిన కేసీఆర్ వరి తక్కువ వేయాలని చెప్పారని గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో యాసంగి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాలకు తేమ లేకుండా ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. క్వింటాకు రూ.1960 తీసుకొని లాభంతో సంతోషంగా వెళ్లాలన్నారు. మంచి ధాన్యంలో తరుగుతీసి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే రైస్ మిల్లులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ రైతులను వరి వేయాలని, కేంద్రంతో తాము కొనిపిస్తామని రెచ్చగొట్టిన బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇప్పుడు పక్కకు తప్పుకున్నారని దుయ్యబట్టారు. అయితే యాసంగిలో నూక శాతం వల్ల కలిగే నష్టం ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి సీఎం కేసీఆర్ రైతులకు భరోసా కల్పంచారన్నారు. వరి వేయండని రెచ్చగొట్టి తప్పించుకున్న బీజేపీ నాయకుల మాటలు రైతులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని కోరారు. ఉద్యమమైన, రాష్ట్ర అభివృద్ధి లోనైనా తెలంగాణ ప్రజల సంక్షేమానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని పునరుద్ఘాటించారు.