Kaleshwaram | పునరుజ్జీవ సంకల్పం నెరవేరిన సందర్భమిది. కాళేశ్వర జలం శ్రీరాంసాగర సంగమమిది. ఎదురెక్కి వచ్చిన గంగ.. వరదకాలువ ద్వారా వడివడిగా అడుగులేస్తూ సాగరసన్నిధికి చేరే అద్భుత జలదృశ్యం ఆవిష్కృతమైంది. శుక్రవారం సాయంత్రం ముప్కాల్ పంప్హౌస్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీలోకి కాళేశ్వర జలాలు ప్రవేశించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత ఫలితంగా కాళేశ్వర గంగ తెలంగాణ జీవరేఖగా అవతరించింది. ఎటువంటి వర్షాభావ పరిస్థితుల్లోనూ జల అక్షయంగా తెలంగాణకు భరోసానిస్తున్నది.
హైదరాబాద్/నిజామాబాద్/పెద్దపల్లి, జూలై 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కాలం కాకున్నా సాగుకు ఢోకా ఉండకూడదన్న సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయాల్లో పునరుజ్జీవ పథకం ద్వారా ఎస్సారెస్పీని నింపే అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. సముద్రంలో వృథాగా కలుస్తున్న నదీ జలాలను రివర్స్ పంపింగ్ ద్వారా ఎదురెక్కించి వరద కాలువను సజీవజలధారగా మార్చాలన్న సీఎం కేసీఆర్ జల ఆశయం నెరవేరింది. తెలంగాణ వరప్రదాయినికి ఊపిరి వచ్చింది. కాళేశ్వర గంగ ఉప్పొంగి శ్రీరాంసాగర్ను ముద్దాడింది. నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ మండలం శ్రీరాంసాగర్ వద్ద ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాన్ని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. స్విచ్చాన్ చేసి నాలుగు మోటర్ల ద్వారా కాళేశ్వరం నీళ్లను ఎస్సారెస్పీలోకి వదిలారు. ఎస్సారెస్పీలోకి జలాలు పరుగులు తీస్తుండగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ అద్భుతమైన ఘట్టాన్ని చూసేందుకు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వర్షాభావ పరిస్థితుల్లో నీటి ఎద్దడి ఉన్న ఎస్సారెస్పీ చెంత జల సవ్వడిని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఎస్పారెస్పీ ఆయకట్టు కింద ప్రతి ఎకరాకు నీరందించేందుకు కాళేశ్వర జలాలను ఎదురెక్కించారని, ఇది సీఎం కేసీఆర్ సృష్టి అని వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు.
వర్షాభావ పరిస్థితుల్లో రైతులను ఆదుకొనేందుకు ఎస్సారెస్పీలో 20 టీఎంసీలకు అదనంగా 30 టీఎంసీలు నీళ్లు ఎత్తిపోయాలని సీఎం ఆదేశించినట్టు చెప్పారు. ఆరు రోజుల క్రితం 300 కిలో మీటర్లు దూరంలో ఉన్న 8 పంపుల ద్వారా నీళ్లను లిఫ్ట్ చేసి కాళేశ్వరం నీళ్లను రివర్స పంపింగ్ ద్వారా ఎస్పారెస్పీని ముద్దాడేలా చేశామని తెలిపారు. ఇదంతా కండ్లతో చూస్తుంటే చాలా సంబురంగా ఉన్నదని అన్నారు. ఇది చారిత్రాత్మకమైన రోజని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గోదావరి, కృష్ణలో మన వాటా ఎంత అని అడిగిన సందర్భంలో అప్పటి సమైక్య పాలకులు అన్న మాటలు గుర్తొస్తే కండ్లల్లో నీళ్లు తిరుగుతాయని గుర్తుచేశారు. ‘గోదావరి కిందికి ఉన్నది.. మీరు పైన ఉన్నరు.. పైకి నీళ్లు ఎట్లా వస్తయ్?’ అని హేళన చేశారని, కానీ అసాధ్యమైన ఆ పనిని మొనగాడు కేసీఆర్ సుసాధ్యం చేశారని తెలిపారు. 2001లో పరేడ్ గ్రౌండ్లో కేసీఆర్ జల సాధన సభ నిర్వహిస్తే 5 లక్షల మంది వచ్చారని, అందులో తాను కూడా ఒక సామాన్య కార్యకర్తగా వెళ్లి ప్రసంగాన్ని విన్నానని గుర్తుచేశారు.
పునర్జీవ పథకంలో దిగ్విజయంగా ఎత్తిపోతలు
ఎస్సారెస్పీ ఆయకట్టుకు జీవం పోయడమే లక్ష్యంగా కాళేశ్వరం లింక్-1, 2లో ఐదు రోజులుగా ఎత్తిపోతలు నిర్విఘ్నంగా నడుస్తున్నాయి. కాళేశ్వరం దిగువన లక్ష్మి బరాజ్కు ప్రాణహిత నుంచి 19,870 క్యూసెకుల ఇన్ఫ్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తుండగా, అధికారులు అకడి కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్హౌస్లోని 7 మోటర్లను నడిపిస్తూ 15,400 క్యూసెకుల నీటిని అదే జిల్లాలోని అన్నారంలోని సరస్వతి బరాజ్లోకి ఎత్తిపోస్తున్నారు. ఇక్కడికి చేరిన నీటిని పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాసిపేటలోని సరస్వతి పంపు హౌస్లోని 6 మోటర్లను నడిపిస్తూ 17,580 క్యూసెకులు మంథని మండలం సిరిపురంలోని పార్వతి బరాజ్లోకి తరలిస్తున్నారు. ఇక్కడికి చేరిన నీటిని అంతర్గాం మండలం గోలివాడలోని పార్వతి పంపుహౌస్లోని నాలుగు మోటర్లను నడిపిస్తూ 10,440 క్యూసెకులు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తున్నారు. ఎల్లంపల్లికి చేరిన కాళేశ్వరం జలాలు టన్నెల్ ద్వారా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంపుహౌస్కు వెళ్తుండగా, అకడి రెండు బాహుబలి మోటర్లను నడిపిస్తూ 6,300 క్యూసెకులను కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్హౌస్కు తరలిస్తున్నారు. ఇక్కడా రెండు బాహుబలి మోటర్లను ఆన్ చేసి 6300 క్యూసెకుల నీటిని 5.7 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా వరద కాలువకు తరలిస్తున్నారు.
గాయత్రి పంపుహౌస్ నుంచి తరలివస్తున్న జలాలు ఎస్సారెస్పీ వైపు పరుగులు తీస్తున్నాయి. 122 కిలోమీటర్ల మేర ఉన్న వరద కాలువలో 73వ మైలురాయి వద్ద నిర్మించిన రాంపూర్ పంప్హౌస్లో నాలుగు మోటర్ల ద్వారా మొత్తం 5,800 క్యూసెక్కుల జలాలు మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట(వరదకాలువ 34వ కిలోమీటరు) వద్ద నిర్మించిన పంపుహౌస్కు చేరుకున్నాయి. శుక్రవారం ఉదయం మూడు మోటర్లను ఆన్ చేసి 4,350 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. వరద కాలువలో ఎదురెక్కుతున్న జలాలు నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ (వరదకాలువ 0.10 కిలోమీటర్) పంపుహౌస్ మీదుగా ఎస్సారెస్పీకి చేరుకోగా, రైతులు సంబురపడ్డారు.
ఇప్పటికే కాళేశ్వరం జలాలు వరదకాలువ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టును తాకగా, శుక్రవారం నుంచి మరో మూడువైపులా నీటిని విడుదల చేశారు. వరదకాలువ 102 కిలోమీటర్ వద్ద ఉన్న రెండు గేట్లను లేపి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర (ఎస్సారార్) జలాశయానికి నీటిని విడుదల చేశారు. ఇక్కడ నాలుగు గేట్లు ఎత్తి 10,300 క్యూసెక్కుల నీటిని కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ రిజర్వాయర్కు, అదే సమయంలో 3,200 క్యూసెక్కుల నీటిని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలోని అనంతగిరి జలాశయానికి తరలిస్తున్నారు. ఎత్తిపోతలు ఇలాగే కొనసాగించి మొత్తం రైతాంగానికి ఈ సీజన్లో సాగు నీరందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్న తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అన్నదాత సంక్షేమమే కేసీఆర్ ధ్యేయం: పోచారం
సీఎం కేసీఆర్ లాంటి నాయకుడితోనే దేశం అభివృద్ధి సాధ్యమని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేయాలనే తపన, దేశానికి అన్నం పెట్టే రైతు బాగుండాలని కోరుకునే ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. ప్రస్తుతం కేంద్రం లో ఉన్న వారికి ప్రభుత్వాలను కూల్చుడు, నోట్ల రద్దు, జీఎస్టీ పెంపు తప్ప పరిపాలన చేతకావడం లేదని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఒకేసారి బాధ్యతలు చేపట్టాయని.. వారు చేసిన మంచి పనులు చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్కటీ లేదన్నారు. కానీ తెలంగాణలో సామాన్య ప్రజలను అడిగినా కేసీఆర్ చేసిన మంచిని వివరిస్తారని తెలిపారు. ఈ దేశానికి సీఎం కేసీఆరే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.
ప్రపంచంలో ఇలాంటి పథకం లేదు: అల్లోల
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగి దశాబ్దాలు దాటిందని, నీరు తక్కువైన సందర్భంలో ఆయకట్టు రైతులకు ఢోకా ఉండకూడదనే ఉద్దేశంతో పునర్జీవ పథకం మొదలు పెట్టుకున్నట్టు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. వందల కిలో మీటర్ల నుంచి వరద కాలువ ద్వారా మనందరి కండ్ల ముందు కాళేశ్వరం నీళ్లను ఎస్సారెస్పీలో వదులుకోవడం అద్భుతమని చెప్పారు. ఎస్సారెస్పీకి ఎలాంటి ఢోకా లేకుండా ఆయకట్టు రైతులకు భరోసా కల్పించే విధంగా కేసీఆర్ ఈ పథకానికి నాంది పలికారని తెలిపారు. ఇలాంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా లేదని పేర్కొన్నారు.
కదిలివచ్చిన కాళేశ్వర గంగ
శుక్రవారం వరదకాలువ నుంచి ఎస్సారెస్పీలోకి కాళేశ్వర జలాల పంపింగ్ను ప్రారంభిస్తున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యే జీవన్రెడ్డి తదితరులు