హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమంలో అగ్రపథంలో దూసుకెళ్లున్న తెలంగాణ రాష్ట్రం పచ్చదనంలోనూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ దార్శనికతతో చేపట్టిన హరితహారం కార్యక్రమం పుడమి తల్లికి పచ్చని కోకను బహమతిగా అందించినట్లయింది. నేడు పెరిగిన అటవీ విస్తీర్ణం..ఆకుపచ్చని అందాలతో తెలంగాణ రాష్ట్రం ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.
హరితహారంలో భాగంగా సరిగ్గా 8 సంవత్సరాల క్రితం (6-7-2015) వ తేదీన మొదటి విడత హరిత హారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామా బాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి ఆవరణలో నాటిన మొక్క నేడు 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9 వ వసంతంలోకి అడుగిడింది. ఈ సందర్భంగా.. ప్రజలు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రి కేక్ కట్ చేసి చెట్టుకు పుట్టిన రోజు వేడుకలు జరిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం చాలా గొప్ప నిర్ణయం అని అన్నారు. ఇది ఓట్ల కోసం చేసేది కాదని భావి తరాల భవిష్యత్తు కోసం చేపట్టిన కార్యక్రమం అని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణపైనే సమస్త మానవాళి మనుగడ ఆధారపడి ఉందన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు హరితహారం కార్యక్రమం చేపట్టి కోట్లాది మొక్కలు నాటించారన్నారు.
ప్రపంచం మొత్తం అడవుల శాతం తగ్గిపోతుంటే మన తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యల వల్ల 7.7 శాతం అడవులు పెరిగాయి అని తెలిపారు. మొక్కలు నాటి సంరక్షించడం మన అందరి బాధ్యత అని మంత్రి గుర్తు చేశారు. మొక్కలు నాటడంతో సకాలంలో వర్షాలు కురుస్తాయని మంత్రి పేర్కొన్నారు.