వేల్పూర్/మోర్తాడ్, నవంబర్ 10: కాంగ్రెస్ మాయమాటలను నమ్మొద్దని, కర్ణాటకలో నమ్మి ఓటేస్తే అధికారంలోకి వచ్చి ఉన్న పింఛన్లను పీకేస్తున్నదని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. పది గంటల కరెంట్ హామీనిచ్చి ఐదు గంటలు కూడా ఇవ్వకుండా రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నదని మండిపడ్డారు. శుక్రవారం ఆయన వేల్పూర్, మెండోరా మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్లూర్లో మంత్రి ఎన్నికల ప్రచారం కోసం బంజారి పటేల్ పద్మ అనే మహిళ వేములకు రూ.5 వేల విరాళం అందజేసింది.
ప్రచారంలో భాగంగా వేముల మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అమ లు చేయని పథకాలను ఓట్ల కోసం తెలంగాణలో చేస్తామని చెబుతున్నారని, ఇది ఎంతవరకు సమంజసమో ప్రజలు ఆలోచించాలని కోరారు. కాగా సర్వసమాజ్, గంగపుత్ర సంఘ సభ్యులు మంత్రి వెంటే ఉంటామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. జాన్కంపేట్కు వచ్చిన మంత్రికి తీర్మాన కాపీలను అందజేశారు. కాగా బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.