ఖలీల్వాడీ, మే 28: పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలను ఉచితంగా అందించడమే సర్కారు లక్ష్యమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో రూ.2.14 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన సీటీ స్కాన్, రూ.30 లక్షలతో ఏర్పాటు చేసిన ఐ పాకో మిషన్, రూ.7 లక్షలతో నెలకొల్పిన ఎక్స్రే యూనిట్లను, మానసిక రోగుల చికిత్సా విభాగాన్ని.. జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, నగర మేయర్ దండు నీతూకిరణ్తో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలకు భారంగా మారిన సీటీ స్కాన్ సేవలను జిల్లా దవాఖానలో ఉచితంగా అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉందని చెప్పారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తున్నదని తెలిపారు. కోరిన వెంటనే అధునాతన యంత్ర పరికరాలను సమకూర్చిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావుకు ఈ సందర్భంగా జిల్లా ప్రజల తరఫున మంత్రి ప్రశాంత్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు.