Minister Uttam Kumar Reddy | హైదరాబాద్, డిసెంబర్11 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం త్వరలోనే కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. రాష్ట్ర వాటా కోసం కొట్లాడుతామని పేర్కొన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. సాగునీటి పారుదలశాఖ ఉన్నతాధికారులతో హైదరాబాద్ ఎర్రమంజిల్లోని జలసౌధలో సోమవారం మంత్రి సమీక్ష నిర్వహించారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీటిని అందించే ప్రాజెక్టులపై దృష్టి పెడతామని, పెండింగ్ప్రాజెక్టులను పూర్తిచేస్తామని, 40 వేల చెరువుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. తుమ్మడిహట్టి ప్రాజెక్ట్ నిర్మాణంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఎస్ఎల్బీసీ పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తామ ని, ప్రాజెక్టు పూర్తికి ఎంత అవసరమైనా ఖర్చు చేసేందుకు ముఖ్యమంత్రితో, మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సాగునీటిపారుదలశాఖ మంత్రిగా ఈ నెల 14న బాధ్యతలను స్వీకరించనున్నట్టు మంత్రి తెలిపారు. ఆ తదుపరి మరోసారి ఇరిగేషన్శాఖపై ప్రాజెక్టులవారీగా పూర్తిస్థాయిలో స మీక్ష నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. త్వరలోనే క్యాబినెట్లో చర్చించి కాళేశ్వరం ప్రాజెక్ట్పై విచారణకు ఆదేశిస్తామని చెప్పారు.
ఎక్స్టెన్షన్ పద్ధతిని రద్దుచేయండి
ఇరిగేషన్ శాఖలో ఎక్స్టెన్షన్ పద్ధతిని రద్దును చేయాలని, అలా కొనసాగుతున్న అధికారులను వెం టనే తొలగించాలని హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జలసౌధలో మం త్రి ఉత్తమ్కు విజ్ఞాపన పత్రాన్ని అందజేసింది. అదేవిధంగా జోన్ 6 ఇంజినీర్లకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుచేయాలని కోరింది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు కోసం కృషి చేయాలని విజ్ఞప్తిచేసింది.