హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి సచివాలయంలోని తన చాంబర్లో గురువారం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటి పారుదలశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జా, ఇతర ఉన్నతాధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీల ద్వారా ప్రాజెక్టుల పనుల పురోగతిని తెలుసుకున్నారు.
అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ యుద్ధప్రాతిపదికన ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి ప్రాజెక్టు పూర్తిచేయాలని ఆదేశించారు. 9 కిలోమీటర్ల మేర టన్నెల్ పనులు జరగాల్సి ఉన్నదని, సొరంగానికి ఇరువైపులా వెంటనే పనులు చేపట్టి రెండేండ్లలో పూర్తి చేయాలని సూచించారు. సాంకేతిక పనుల పూర్తికి, ఇతర సమస్యల పరిష్కారానికి అధికారుల బృందంతో కమిటీ వేయాలని రాహుల్ బొజ్జాను ఆదేశించారు. డిండి, పెండ్లిపాకాల రిజర్వాయర్ల పనులు దాదాపు 95 శాతం మేరకు పూర్తయ్యాయని, భూసేకరణకు మరో రూ.90 కోట్లు అవసరమని, పర్యావరణ, అటవీ అనుమతులు వచ్చేలా పనులను వేగవంతం చేయాలని చెప్పారు. ప్రతివారం సమీక్షలు చేయాలని, ఏజెన్సీలు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
విద్యుత్తు డిమాండ్ను తీర్చడానికి జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లతో విద్యుదుత్పత్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు.