హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సందర్భం గా కాంగ్రెస్ ఇచ్చిన రూ.500కే గ్యాస్ సిలిండర్, ధాన్యంపై క్వింటాలుకు రూ.500 బోనస్ హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని, ఇందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. అదే విధంగా కొత్త రేషన్కార్డుల జారీపై సీఎం రేవంత్రెడ్డితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మంగళవారం ఆయన సివిల్సైప్లె భవన్లో పౌరసరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీడీఎస్ ద్వారా ఇస్తున్న బియ్యంలో నాణ్యత కొరవడిందని, ఇకపై లబ్ధిదారులు తినగలిగేలా పూర్తి నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.
పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతున్నదని, దీనిపై అధికారులు దృష్టి పెట్టి అరికట్టాలని స్పష్టం చేశారు. రైస్ మిల్లర్ల నుంచి బియ్యం సేకరణలో జాప్యం ఎందుకు జరుగుతున్నదని ప్రశ్నించారు. ప్రస్తుతం రైస్మిల్లర్ల వద్ద రూ.18 వేల కోట్ల విలువైన 88 లక్షల టన్నుల ధాన్యం ఉన్నదని, దీనికి ఎలాంటి గ్యారంటీ లేదని తెలిపారు. ఈ అంశంపై ఏం చేయాలనేది సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ప్రస్తుతం పౌరసరఫరాల కార్పొరేషన్కు రూ.56 వేల కోట్ల అప్పులు ఉన్నాయని, దీనిపై త్వరలోనే లోతుగా చర్చిస్తామని వెల్లడించారు. రైతుల నుంచి ధాన్యం కొన్న వెంటనే వారికి డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాల సంస్థను అభివృద్ధి చేసేందుకు కేంద్రంతో కలిసి ముందుకెళ్తామని, బాయిల్డ్రైస్ అంశంపై కేంద్రంతో చర్చిస్తామని పేర్కొన్నారు.