హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తప్పుడు ప్రచారం మానుకోవాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు హితవు పలికారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఉత్తమ్ ఇకనైనా అబద్ధాల ప్రవాహాన్ని ఆపాలి. కాళేశ్వరంపై మీరు చేస్తున్నది దుష్ప్రచారం అని పూర్తి ఆధారాలతో బట్టబయలు చేసినా మళ్లీ అవే అబద్ధాలు చెప్తున్నారు. మీలాగా ప్రిపేర్ కాకుండా వచ్చే అలవాటు మాకు లేదు. పూర్తి ఆధారాలతో ఈ రోజు ప్రజెంటేషన్లో అన్ని వాస్తవాలు వెల్లడించాను. ఐదేండ్లలో మేడిగడ్డలో ఎత్తిపోసిన నీళ్లు 162 టీఎంసీలే అని చెప్తున్న మీరు కాళేశ్వరంలో భాగమైన ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు లిఫ్ట్ చేసిన విషయాన్ని ఎందుకు చెప్పరు? లక్ష్మి, సరస్వతి, పార్వతి, నంది, గాయత్రి పంప్హౌస్ల నుంచి ఎత్తిపోసిన నీళ్ల గురించి ఎందుకు దాస్తారు? కాళేశ్వరం కట్టిన మూడేండ్లలోనే.. అంటే 2022-23 వరకే మేడిగడ్డ నుంచి 162.41 టీఎంసీలు, అన్నారం నుంచి 172.86 టీఎంసీలు, సుందిళ్ల నుంచి 172.12 టీఎంసీలు, నంది పంప్హౌస్ నుంచి 181.70 టీఎంసీలు, గాయత్రి పంప్హౌస్ నుంచి 179.41 టీఎంసీల జలాలను ప్రాజెక్టులో ఎత్తి పోసినం. మీ ఇంజినీర్లను అడిగి తెలుసుకోండి. గోబెల్స్ ప్రచారం ఎందుకు చేస్తున్నారు?’ అని హరీశ్రావు పేర్కొన్నారు.
ఏ ప్రాజెక్టు అయినా అంతే..
9 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా 1963లో ప్రారంభించిన ఎస్సారెస్పీ పనులు 1975 నాటికి పూర్తి కాగా, 11ఏళ్ల తర్వాత మొదటగా వచ్చిన ఆయకట్టు 25వేల ఎకరాలు మాత్రమేనని హరీశ్రావు గుర్తుచేశారు. ‘నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 1955 శంకుస్థాపన చేస్తే 1966లో పూర్తిచేశారు. 12 ఏండ్ల తర్వాత ఎడమ కాల్వ ద్వారా 5 లక్షల ఎకరాల లక్ష్యానికి గాను మొదట్లో వచ్చిన ఆయకట్టు 98,842 ఎకరాలు మాత్రమే. కాంగ్రెస్, తెలుగుదేశం కట్టిన కల్వకుర్తి ప్రాజెక్టు 1984లో ప్రారంభమై 2014 నాటికి మీరు ఇచ్చిన ఆయకట్టు 3.3 లక్షల ఎకరాలకు గాను మొదట్లో ఇచ్చింది 13వేల ఎకరాలకు మాత్రమే. 2001లో మొదలు పెట్టిన దేవాదు ల ప్రాజెక్టు ద్వారా 2014 నాటికి ఆరు లక్షల ఎకరాలకు గాను మీరు ఇచ్చింది 45వేల ఎకరాలు మా త్రమే. ఏ ప్రాజెక్టు చూసినా ఇదే పరిస్థితి. ఏ ప్రాజెక్టులో అయినా హెడ్వర్స్ మొదట పూర్తిచేసి టెయి ల్ వర్స్ తర్వాత పూర్తి చేస్తుంటారు. కానీ మీరు మాత్రం కమీషన్ల కోసం తోక పనులు మొదలుపెట్టి, హెడ్వర్స్ వదిలి పెట్టారు. ఆ ఘనత మీ కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుంది. ఇకకైనా తలాతోక లేని మాటలు మాట్లాడం. అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోవాలని సూచిస్తున్నాం’ అని హరీశ్ పేర్కొన్నారు.