Minister Uttam Kumar Reddy | గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలపై మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు పథకాలకు ఇప్పటికే సుమారు 80 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని.. పథకం అందని వారు అధైర్యపడొద్దని నిజమైన లబ్ధిదారులందరికీ పథకాలను వర్తింజేస్తామని భరోసా ఇచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పోలీస్ భరోసా సెంటర్ ప్రారంభం అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిన ఘటనలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. జరిగిన నష్టంపై రాజ్యాంగబద్ద సంస్థ ఎన్డీఎస్ఏతో విచారణ జరుపుతున్నామని, ప్రస్తుతం అథారిటీ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం ప్రాజెక్టులను బారేజీలను పరిశీలిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి కావాల్సిన సమాచారాన్ని అందించి పూర్తిగా సహకరిస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి వాటిల్లిన నష్టాన్ని నిపుణుల బృందం అంచనా వేస్తున్నారని త్వరలోనే విచారణ అంశాలను వెల్లడిస్తామని తెలిపారు.