Uttam Kumar Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై గాంధీభవన్లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించిన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి బడాయి మాటలు చెప్పబోయి అభాసుపాలయ్యారు. ఇదే అంశంపై ఆ శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ శనివారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించగా, రెండు రోజుల తర్వాత తిరిగి సోమవారం మంత్రి ఉత్తమ్ కూడా అదే పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి, అవే మాటలు వల్లెవేశారు. అంతేకాకుండా, పౌరసరఫరాల సంస్థ అప్పులపై డీఎస్ చౌహాన్ మాట్లాడిన దానికి భిన్నంగా చెప్పి, అవగాహనా రాహిత్యాన్ని ప్రదర్శించారు.
మీడియా సమావేశంలో ఉత్తమ్ చెప్పిన విషయాల్లోకొన్ని అంశాలు వాస్తవాలకు భిన్నంగా ఉండటం గమనార్హం.
ఉత్తమ్: పౌరసరఫరాల సంస్థ అప్పులను రూ.58 వేల కోట్ల నుంచి రూ.5 వేలకు తగ్గించాం.
వాస్తవం: శనివారం మీడియాతో మాట్లాడిన పౌరసరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్.. సంస్థ అప్పులు మొన్నటివరకు రూ.58 వేల కోట్లు ఉండగా, ఇందులో గత మూడు నెలల్లో రూ.5 వేల కోట్ల అప్పును తగ్గించినట్టు తెలిపారు. అంటే కమిషనర్ లెక్కల ప్రకారం కార్పొరేషన్ అప్పు రూ.53 కోట్లు. కానీ, మంత్రి ఉత్తమ్ మాత్రం రూ. 58 వేల కోట్ల అప్పును రూ.5 వేల కోట్లకు తగ్గించినట్టు చెప్పడం గమనార్హం.
ఉత్తమ్: గత ప్రభుత్వం ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రూ.22 వేల కోట్ల ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించింది.
వాస్తవం: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం కొనుగోలు చేసిన యాసంగి ధాన్యాన్ని కూడా గతంలో మాదిరిగానే మిల్లర్లకే అప్పగిస్తున్నది. ఇందుకోసం ఎలాంటి సెక్యూరిటీ తీసుకోలేదు. కానీ, మంత్రి మాత్రం గతానికి భిన్నంగా తామేదో మార్పులు చేసినట్టు చెప్పడం గమనార్హం.
ఉత్తమ్: ధాన్యం వేలంలో గతం కన్నా రూ.1,100 కోట్ల అదనంగా ఆదాయం వచ్చింది.
వాస్తవం: గత ప్రభుత్వంలో క్వింటా ధాన్యానికి సగటున రూ.1,760 చొప్పున ధర పలికింది. అయితే, ధర తక్కువ రావడంతో కార్పొరేషన్కు నష్టం వస్తుందనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఆ టెండర్ను రద్దు చేసింది. ఇలా రద్దు చేసిన టెండర్ ధరతో పోల్చుతూ మంత్రి ఉత్తమ్ కాంగ్రెస్ ప్రభు త్వం వేసిన టెండర్ల గురించి గొప్పలు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ధాన్యం వేలంలో క్వింటాకు సగటు ధర రూ.2,022 వచ్చిందని తెలిపారు. ఇందులో అసలు ధాన్యం ధర రూ.1,850 మాత్రమే ధర పలికింది. అయితే ధరను ఎక్కువ చేసి చూపేందుకు ధాన్యం ధరకు గన్నీ, మార్కెట్ ఫీజును కలిపి మొత్తం ధాన్యానికి ఎక్కువ ధర వచ్చినట్టుగా చూపడం గమనార్హం. వేలంలో విక్రయించిన ధాన్యాన్ని వ్యాపారులు ఎత్తడం లేదని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మంత్రి ఉత్తమ్ సమాధానం చెప్పకుండా దాటేశారు.