KTR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ, రైతాంగాన్ని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
వ్యవసాయం దండుగ అన్నచోటనే పండుగ అయ్యింది. నెర్రెలు బారిన ఈ నేల దశాబ్ది లోపే 2 కోట్ల ఎకరాల పచ్చని మాగాణమైంది! అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. కరువునేలగా అల్లాడిన తెలంగాణ ఇవాళ దేశానికి బువ్వపెట్టే అన్నపూర్ణగా మారింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని కిసాన్ సర్కార్ దేశంలో ఎక్కడాలేని విధంగా రైతన్నకు అందిస్తున్న వరాల వల్లనే ఈ అద్భుతం ఆవిష్కృతమైందని కేటీఆర్ స్పష్టం చేశారు.
తొమ్మిదేళ్లలోనే నెర్రెలుబారిన ఈ నేల దేశానికి ధాన్యాగారమైందంటే దానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రైతు ప్రభుత్వమే! అని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని పథకాల వల్లనే ఈ అద్భుతం సాధ్యమైంది అని కేటీఆర్ అన్నారు.
65 లక్షల మంది రైతులకు రూ. 66 వేల కోట్ల పెట్టుబడి సాయంగా రైతుబంధు కింద అందించిన ఏకైక ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు. ఒక్కో రైతుకు రూ. 5 లక్షల చొప్పున లక్షా 782 రైతు కుటుంబాలకు రూ.5,039 కోట్లు పరిహారంగా చెల్లించి ఆదుకున్నది మన ప్రభుత్వం. 27 లక్షల వ్యవసాయ మోటార్లకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రతిదశలోనూ రైతుకు అండగా ఉండేందుకు 10,769 గ్రామాల్లో రైతుబంధు సమితులు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. భూ యాజమాన్య హక్కులపై స్పష్టత ఇచ్చేందుకుగానూ భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన చేపట్టి ధరణి ద్వారా శాశ్వత పరిష్కారం చూపించామన్నారు. రైతులను సంఘటితం చేసేందుకు ప్రతి 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున 2,601 రైతువేదికల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందిస్తున్నామని తెలిపారు. పండిన పంట నిలవకు నూతన మార్కెట్ షెడ్లు, గోదాముల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.
పండిన ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతన్నకు అండగా తీసుకున్న చర్యల మూలంగా తెలంగాణలో సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల నుండి 2.09 కోట్ల ఎకరాలకు పెరిగిందని తెలిపారు. 2014లో 68 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి నేడు 2.60 కోట్ల టన్నుల మెట్రిక్ టన్నులకు ధాన్యం ఉత్పత్తి పెరిగిందని కేటీఆర్ స్పష్టం చేశారు.
🌾🌿🌱🌴
తొమ్మిదేళ్లలోనే నెర్రెలుబారిన ఈ నేల దేశానికి ధాన్యాగారమైందంటే దానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రైతు ప్రభుత్వమే!దేశంలో మరే రాష్ట్రంలో లేని పథకాల వల్లనే ఈ అద్భుతం సాధ్యమైంది:
🌿రైతుబంధు: 65లక్షల మంది రైతులకు 66 వేల కోట్ల రూపాయలను పెట్టుబడి సాయంగా అందించిన…
— KTR (@KTRBRS) June 3, 2023