హైదరాబాద్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీని త్వరలోనే చేపట్టనున్నట్టు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. రెండో విడత పంపిణీపై శనివారం సీఎస్ శాంతికుమారితో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మిగిలిన లబ్ధిదారులకు గొర్రెలను పంపణీ చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 7.31 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించగా, తొలి విడతలో 3.93 లక్షల మందికి గొర్రెలు అందించామని, మిగిలిన 3.38 లక్షల మందికి త్వరలోనే పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. పాత జాబితాలో ఎవరైనా మరణిస్తే వారి స్థానంలో వారి నామినీని మాత్రమే చేర్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇక అర్హులైన వారి నుంచి లబ్ధిదారుడి వాటాలకు డీడీలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అవగాహన కల్పించాలని ఆదేశించారు.
రెండో విడత కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించేందుకు ఈసారి గొర్రెల కొనుగోలు పూర్తిగా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే జరుగుతుందని మంత్రి స్పష్టంచేశారు. ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల్లో గొర్రెలు అందుబాటులో ఉండే మారెట్లను పశు సంవర్ధక శాఖ గుర్తించిందని తెలిపారు. కొనుగోలు చేసిన గొర్రెల రవాణకు ట్రాన్స్పోర్ట్ టెండర్లను వెంటనే నిర్వహించాలని ఆదేశించారు. పశుసంవర్ధక శాఖ అధికారులు కేవలం ఇన్సూరెన్స్, జీవాల ఆరోగ్యపరిస్థితి తదితర విషయాలను పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలుకు లబ్ధిదారులను కూడా తీసుకెళ్లాలని చెప్పారు. గొర్రెల యూనిట్ ధరను సీఎం కేసీఆర్ రూ.1.20 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.