హైదరాబాద్, ఆగస్టు 25(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలోని మత్స్యకారుల కుటుంబాలు అభివృద్ధి చెందాయని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసబ్ట్యాంక్ మత్స్యశాఖ కార్యాలయంలో రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్గా దీటి మల్లయ్య బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. చెరువులపై పూర్తి హక్కులను ప్రభుత్వం మత్స్యకారులకే కల్పించిందని, జలాశయాల్లో ఉచితంగా చేప, రొయ్య పిల్లలను విడుదల చేస్తున్నదని గుర్తుచేశారు. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రంలో మత్స్య సంపద గణనీయంగా పెరిగిందని వివరించారు.
రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 1.98 లక్షల టన్నుల వరకు మత్స్య సంపద ఉత్పత్తి ఉండగా, నేడు 4.24 లక్షల టన్నులకు పెరిగిందని చెప్పారు. ఏడాది పొడవునా మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందని, దీంతో వారు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. వైస్ చైర్మన్ దీటి మల్లయ్య మాట్లాడుతూ ఫెడరేషన్ వైస్ చైర్మన్గా తనకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, వివిధ జిల్లాలకు చెందిన మత్స్యకారులు, గంగపుత్ర సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.