హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పశువులు, ఇతర జీవాలు వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జీవాలకు అవసరమైన అన్ని మందులు పశువైద్యశాలల్లో అందుబాటులో ఉంచాలని, పశు వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పశువులన్నింటికి ముందు జాగ్రత్త చర్యగా రోగాలు రాకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయడం, నట్టల నివారణ మందులు తాగించడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అత్యవసర సేవలకు మొబైల్ వెటర్నరీ క్లినిక్ టోల్ ఫ్రీ నంబర్ 1962కి ఫోన్ చేసి పశువులకు అవసరమైన వైద్య సేవలను పొందే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.