హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ఉచిత చేప పిల్లల పంపిణీని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ శనివారం ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు చేపపిల్లలను అందజేస్తారు. ఈ ఏడాది రూ.110 కోట్లతో చేప, రొయ్య పిల్లల పంపిణీకి అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందులో 26,357 జలవనరుల్లో రూ.84.13 కోట్లతో 85.60 కోట్ల చేప పిల్లలను, 315 జల వనరుల్లో రూ.25.99 కోట్లతో 10 కోట్ల రొయ్య పిల్లలను వదలనున్నారు. నిరుడు రూ.62.79 కోట్ల ఖర్చుతో 77 కోట్ల చేప పిల్లలు, రూ.21.23 కోట్ల ఖర్చుతో 8.64 కోట్ల రొయ్య పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేసింది. గడిచిన ఎనిమిదేండ్లలో చేప పిల్లల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.414 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాదితో కలిపితే ఆ మొత్తం రూ.524 కోట్లకు చేరనున్నది. ఈ ఏడాది చేప పిల్లల పంపిణీని నవంబర్ వరకు పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నిండుకుండలా మారడంతో వీలైనంత ఎక్కువ మొత్తంలో చేప పిల్లల విడుదలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో మత్స్య వృత్తి కుదేలై.. దానిపై ఆధారపడిన మత్స్యకారుల జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. మత్స్యకారుల బతుకుల్లో వెలుగులు నింపాలని తలంపుతో సీఎం కేసీఆర్ 2016లో ఉచిత చేప పిల్లల పంపిణీని ప్రారంభించారు. ఇందుకు ఏటా రూ.100 కోట్లు ఖర్చుచేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఈ పథకం మత్స్యకారులకు వరంలా మారింది. ఇప్పటి వరకు 414 కోట్ల చేప పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేయగా వీటి ద్వారా 23 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అయ్యాయి. వీటి విలువ సుమారు రూ.32 వేల కోట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పథకం ద్వారా మత్స్యకారుల జీవితాలు ఆర్థికంగా బలోపేతమయ్యాయి.
నాలుగేండ్ల క్రితం వరకు తెలంగాణలో చేపలు తినాలంటే ఇతర రాష్ర్టాల చేపలే దిక్కయ్యేవి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి భారీగా పెరిగింది. 2016-17లో రాష్ట్రంలో 2 లక్షల టన్నుల చేపలు మాత్రమే ఉత్పత్తి అయ్యేవి. అది ఈ ఏడాది 4.38 లక్షల టన్నులకు పెరిగింది. అంటే సుమారు 125 శాతం చేపల ఉత్పత్తి పెరిగింది. దాంతో చేపలు దిగుమతి చేసుకొనే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగింది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చేపలను ఇక్కడి వ్యాపారులు ఢిల్లీ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఛత్తీస్గఢ్, అస్సాం వంటి రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న మంచినీటి చేపలకు ఆయా రాష్ర్టాల్లో భారీ డిమాండ్ ఉన్నది.