హైదరాబాద్ : పాడి పరిశ్రమ రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని, పాడి రైతులను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ప్రభుత్వ రంగంలోని తెలంగాణ విజయ డెయిరీకి పాలు పోస్తున్న పాడి రైతులకు ప్రభుత్వం ఎంతో చేయూతను అందిస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణ విజయ డెయిరీ రైతుల నుండి సేకరిస్తున్న గేదె, ఆవు పాల ధరలను పెంచడం జరిగిందన్నారు. లీటరు గేదె పాలకు రూ.4.68, లీటరు ఆవు పాలకు రూ.2.88 చొప్పున పెంచడం జరిగిందని, పెంచిన ధరలు పిబ్రవరి 16 వ తేదీ నుండి అమలులోకి వస్తాయని మంత్రి వివరించారు. రైతులకు ఇది నిజంగా గొప్ప శుభవార్త అని మంత్రి పేర్కొన్నారు.
పెంచిన ధరలతో గేదె పాలు రూ.36.99 నుండి రూ.41.64 కు, ఆవు పాల ధర రూ.29.76 నుండి రూ.32.64 కు పెంచామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు నష్టాలలో ఉన్న విజయ డెయిరీ సంస్థ సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో రూ.700 కోట్ల టర్నోవర్కు చేరుకుందని చెప్పారు. విజయ డెయిరీ నుంచి ప్రస్తుతం చేస్తున్న పాలు, పాల ఉత్పత్తులకు అదనంగా నాణ్యమైన నూతన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చే లక్ష్యంతో రంగారెడ్డి జిల్లా రావిర్యాల గ్రామ పరిధిలో 40 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక టెక్నాలజీతో రూ.246 కోట్ల వ్యయంతో మెగా డెయిరీని నిర్మిస్తున్నామన్నారు.
విజయ డెయిరీకి పాలు పోసే పాడి రైతులను ప్రోత్సహించాలనే ఆలోచనతో లీటర్ పాలకు 4 రూపాయల ప్రోత్సాహకాన్ని అందజేసే కార్యక్రమాన్ని 2014 నవంబర్లో ప్రారంభించినట్లు తెలిపారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇతర సహకార డెయిరీలు.. నార్మూల్, కరీంనగర్ డెయిరీ, ముల్కనూరు మహిళ డెయిరీలలో పాల సేకరణ చేస్తున్న పాడి రైతులకు కూడా నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు రూ.343 కోట్లను ఈ పథకం కింద పాల ఉత్పత్తిదారులకు అందజేశామన్నారు.
సహకార రంగంలో నిర్వహిస్తున్న విజయ డెయిరీ సంస్థకు వచ్చే లాభాలను వివిధ సంక్షేమ కార్యక్రమాలతో తిరిగి పాడి రైతులకే అందజేస్తున్నట్లు వివరించారు. అందులో భాగంగా పాడి పశువుల కొనుగోలుకు, విజయ పెళ్లి కానుక ఆర్థిక సాయం, దురదృష్టవశాత్తు పాడి రైతు మరణిస్తే అంత్యక్రియల ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించిన, ఐఐటీ జేఈఈలో సీటు సాధించిన విద్యార్ధులకు నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రము అందిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ పాలు పోసే పాడి రైతుకు నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని అందించడం ద్వారా పాడి రైతులు పాల ఉత్పత్తిని మరింత పెంచే విధంగా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. 1500 లీటర్లు అంతకన్నా ఎక్కువ పాలు పోసే పాడి రైతులకు గడ్డి కత్తిరించే యంత్రాలు, పాల క్యాన్లు, విద్యుత్ సబ్సిడీ, సబ్సిడీ ద్వారా దాణా, మినరల్ మిక్చర్, ఇన్సూరెన్స్ సబ్సిడీ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పాడి ద్వారా అర్ధికాభివృద్ధి సాధించేందుకు సన్న, చిన్న కారు రైతులకు మహిళా పాల ఉత్పత్తిదారుల పాడి పశువుల కొనుగోలు కోసం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, శ్రీనిధి బ్యాంకు ద్వారా, నాబార్డ్ ద్వారా ప్రాథమిక సహకార సంఘాల పరిధిలో విజయ పాడి రైతులకు రుణాలు అందజేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు.
పాల ఉత్పత్తి సామర్థ్యం పెంపు కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అందులో భాగంగా వ్యాక్సినేషన్, నట్టల నివారణ మందుల పంపిణీ, సబ్సిడీపై గడ్డి విత్తనాల సరఫరా, మారుమూల ప్రాంతాల్లోని పశువులకు 1966 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పాడి రంగంపై ఆధారపడిన ప్రతి ఒక్కరు ఆర్థిక స్వావలంభన సాధించేలా సహకారం అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. పాడి రైతులకు అనేక విధాలుగా చేయూతను అందిస్తున్న విజయ డెయిరీకి పాలు పోయడం ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని పాడి రైతులను మంత్రి కోరారు. అంతే కాకుండా కరీంనగర్, ముల్కనూర్, నార్మూల్ డెయిరీలను కూడా ప్రోత్సహించాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా కోరారు.