ఆదిలాబాద్, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం అందిం చే పంట నష్టపరిహారం పరిహాసంగా మారింది. గతేడాది జిల్లా వ్యాప్తంగా ఆగస్టులో కురిసిన భారీ వర్షాలు అన్నదాతను అపార నష్టానికి గురిచేశాయి. వాగులు, వంక లు పొంగ ప్రవహించడంతోపాటు చెరువుల కట్టలు తెగిపోగా, చేతికొచ్చిన పంట ల్లో ఇసుక మేటలు వేశాయి. జిల్లా వ్యాప్తంగా వరదల కారణంగా రైతులు 18,310 ఎకరాల్లో పంటలు నష్టపోయారు.
పత్తి పంటకు 14,225 ఎకరా లు, సోయా 3,152 ఎకరాలు, కంది 473 ఎకరాలు, మొక్కజొన్న 364 ఎకరాలు, ఇంతర పంటలు 96 ఎకరాల్లో నష్టపోయినట్లు గుర్తించారు. వర్షాల కారణంగా 18,834 మంది రైతులకు నష్టం జరిగింది. ఆగస్టు 19న జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఇన్చార్జి మం త్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు శాఖలవారీగా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం వివరాలను సేకరించాలని సూచించారు.
ఏడాది నుంచి ఎదురుచూపు
గతేడాది భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల సాయం అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పంటలు నష్టపోయి ఏడాది గడుస్తున్నా, నష్ట పరిహారం అందకపోవడంతో రైతులు ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. లక్షల రూపాయల పెట్టుబడులతో సాగు చేసిన పంటలు వర్షాలతో చేతికి రాకుండా పోగా.. ప్రభుత్వం అందించే సాయం వల్ల కొంత ఉపశమనం పొందుతామనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. పంటలు నష్టపోయిన రైతులకు సర్కారు సాయం అందకపోవడంతో అప్పులు తీర్చలేని పరిస్థితులు నెలకొన్నాయి. పంట నష్టపరిహారం విషయంలో మంత్రి ఇచ్చిన హామీ అమలుకాకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రైతులు పలు మండలాల్లో పంటలను నష్టపోయారు. ప్రభుత్వం గతేడాది నష్టపోయిన పంటలతోపాటు ఇటీవల కురిసిన వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
మంత్రి ప్రకటించినా పరిహారం రాలేదు..
గతేడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో రైతులు వేలాది ఎకరాల్లో పత్తి, సోయా ఇతర పంటలు నష్టపోయారు. ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు ఆదుకుంటామని తెలిపారు. ఎకరాకు రూ.10 వేల సాయం అందిస్తామని తెలిపారు. ఏడాది గడుస్తున్న ప్రభుత్వ పరిహారం అందలేదు. దీంతో రైతులు సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితులు నెలకొన్నాయి. పరిహారం విషయంలో పలుమార్లు వినతులు అందించినా ఫలితం లేదు. జిల్లాలో వారం రోజుల కిందట కురిసిన వర్షాలతో పెన్గంగ పరీవాహక ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అధికారులు ఇప్పటి వరకు సర్వే నిర్వహించలేదు. ప్రభుత్వం గతేడాదితోపాటు ఈసారి నష్టపోయిన పంటలకు వెంటనే సాయం అందించేలా చర్యలు తీసుకోవాలి. – సంగెం బొర్రన్న, రైతు స్వరాజ్యవేదిక, జిల్లా అధ్యక్షుడు