హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 19 (నమస్తే తెలంగాణ ): బీసీల జోలికొస్తే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని బీఆర్ఎస్ బీసీ ప్రజాప్రతినిధులు హెచ్చరించారు. బీసీలను అవమానించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ముక్కు నేలకు రాసి చెంపలు వేసుకొని క్షమాపణ చెప్పేదాకా విడిచిపెట్టే ప్రసక్తేలేదని స్పష్టంచేశారు. ‘బీసీలంటే బానిసలు కాదు, బందూకులు. రేవంత్రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఈ వాస్తవం తెలిసొచ్చేలా చేస్తాం’ అని హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో బీసీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. బీసీలను అవమానించిన రేవంత్రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీసీలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీసీలను దూరం చేయాలనే కుట్రలో భాగంగానే రేవంత్రెడ్డి రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇక మేమేందో చూపిస్తం
తాము తలుచుకుంటే రేవంత్రెడ్డి కాలు కదపలేరని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హెచ్చరించారు. బీసీ నాయకులకు ఫోన్లు చేసి బెదిరించటం, మీడియా సమావేశాలు నిర్వహించి నోటికొచ్చినట్టు వల్గర్గా మాట్లాడటం రేవంత్రెడ్డికి పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు వారి వ్యక్తిగతమా? లేక పార్టీ విధానమా? స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వైఖరిని మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. రేవంత్రెడ్డి తక్షణమే బీసీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘రాజకీయాల్లో విమర్శ, ప్రతివిమర్శ సహజం. కానీ, కాంగ్రెస్ నేతలు బీసీ నాయకులపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఇంతకాలం ఓపిక పట్టినం. ఇక మేమేందో చూపిస్తం. మేం తలుచుకొంటే ఎట్లుంటదో అర్థమయ్యేలా చేస్తం’ అని హెచ్చరించారు. అన్ని బీసీ కులాలను ఏకంచేసి కాంగ్రెస్పై పోరు విషయంలో త్వరలోనే తమ భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. అవసరమైతే హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఇకమీదట బీసీ నాయకులను, కార్యకర్తలను వ్యక్తిగతంగా విమర్శిస్తే సహించబోమని హెచ్చరించారు. తాము రేవంత్లాగా పదిచోట్ల తిరిగి వచ్చినవాళ్లం కాదని స్పష్టంచేశారు. బీసీలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసిందని తెలిపారు. బీసీల ఆత్మగౌరవాన్ని పెంచేలా ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం రూ.3 వేల కోట్ల విలువైన భూములను కేటాయించడంతోపాటు నిర్మాణానికి నిధులు కూడా ఇచ్చిందని చెప్పారు. కులవృత్తులకు అనేక విధాలుగా చేయూతనందిస్తున్నదని పేర్కొన్నారు. తమ ఎదుగుదలకు అండగా నిలిచినా బీఆర్ఎస్ పార్టీ వెంటే బీసీలు ఉన్నారని, దీనిని జీర్ణించుకోలేక బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
బీసీలు బానిసలు కాదు
బీసీలు బానిసలు కాదు.. బంధూకులనే విషయాన్ని కాంగ్రెస్కు తెలిసేలా చేస్తామని మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. బీసీల్లో రాజకీయంగా ఎదుగుతున్నవాళ్లను చులకనచేస్తూ కొందరు అహంకారంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్న కాంగ్రెస్ నేతలు తీరు మార్చుకోకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బీసీల జోలికొస్తే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని అన్నారు. బీసీలను రాజకీయంగా ఎదుగనీయకుండా కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతున్నదని, అందులో భాగమే రేవంత్రెడ్డి వ్యాఖ్యలని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్కు బీసీలు అండగా ఉన్నారన్న అక్కసుతో కాంగ్రెస్ పార్టీ కండ్లల్లో నిప్పులు పోసుకొంటున్నదని మండిపడ్డారు. బీసీ వర్గాల్లో చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. రేవంత్ ముక్కునేలకు రాసి చెంపలు వేసుకుంటే తప్ప వదిలేదిలేదని తేల్చిచెప్పారు. ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ బీసీ వ్యతిరేక విధానాలను ఎండగడతామని తెలిపారు.
ఆత్మగౌరవాన్ని వదులుకోం
రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బీసీలంతా బీఆర్ఎస్ పార్టీతో, సీఎం కేసీఆర్తో ఉన్నారనే అక్కసుతో రేవంత్రెడ్డి ఆ వర్గంలో చిచ్చు పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సమాజంలో 56 శాతం ఉన్న బీసీను హేళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. తాము ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఆత్మగౌరవాన్ని వదులుకోబోమని తేల్చిచెప్పారు. బీసీలకు కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. తాము కూడా రేవంత్రెడ్డికంటే ఎక్కువ బూతులు మాట్లాడగలమని, కానీ సంస్కారం అడ్డువస్తున్నదని అన్నారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ప్రకటనలానే పరిగణించాల్సి ఉంటుందని, ఇదే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ప్రతీ బీసీ బిడ్డకు తెలియజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్, ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, యెగ్గె మల్లేశం, బస్వరాజు సారయ్య, ఎల్ రమణ, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్, గంప గోవర్దన్, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.