హైదరాబాద్: తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడిన తర్వాతే బోనాలు పండుగ (Bonala Festival) ఘనంగా జరుగుతున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. బోనాలు మన సంస్కృతికి ప్రతీకగా నిలలుస్తాయని తెలిపారు. 2014 నుంచి బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని చెప్పారు. బోనాలను సీఎం కేసీఆర్ (CM KCR) రాష్ట్ర పండుగగా ప్రకటించారన్నారు. ఆషాఢ బోనాల సందర్భంగా సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాలి (Ujjaini Mahankali Bonalu) అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబం తొలిబోనం సమర్పించింది. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. బోనాలను ఘనంగా నిర్వహించుకోవాలి అనే ఉద్దేశంతోనే ఆలయాలకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తున్నదని చెప్పారు.
ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్థికంగా సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. బోనాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మహంకాళి బోనాల జాతర విశ్వవాప్తమైందని మంత్రి చెప్పారు. అమెరికా, లండన్, దుబైలో కూడా మహంకాళి బోనాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అమ్మవారి దర్శనానికి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారని వెల్లడించారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా ఈ ఉత్సవాలను జరుపుకొంటామన్నారు. అన్ని శాఖల అధికారులు కలిసి బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగేలా కృషిచేస్తున్నారని, వారందరికి అభినందనలు తెలిపారు.