హైదరాబాద్: నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ కేంద్రంలో బీజేపీ (BJP) ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల ఉసురు పోసుకుంటున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ఆగ్రహం వ్యక్తంచేశారు. ధరలను అదుపుచేయడంలో విఫలమైన ప్రధాని మోదీ (PM Modi) ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. వంట గ్యాస్ ధరల పెంపును (Gas Cylinder price hike) నిరసిస్తూ బీఆర్ఎస్ (BRS) శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్లోని జూబ్లీ బస్స్టేషన్ వద్ద నిర్వహించిన ధర్నా, ఆందోళన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. అంబానీ, అదానీలకు దోచి పెట్టేందుకే గ్యాస్ ధరలు పెంచారని విమర్శించారు.
తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. 2024లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పతనం ఖాయమన్నారు. కంటోన్మెంట్లోని (Contonment) ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు ఆర్మీ హాస్పిటల్లోకి అనుమతించడంలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) చొరవతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మంజూరయిందని చెప్పారు. కంటోన్మెంట్లో గతంలో 15 రోజులకు ఒకసారి తాగునీటి సరఫరా జరిగేదని, నేడు ప్రతినిత్యం నీరు అందుబాటులో ఉన్నదని చెప్పారు. తెలంగాణలో (Telangana) అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తం చేసేందుకే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిందన్నారు.