హైదరాబాద్: చేప ప్రసాదం (Fish Prasadam) కోసం వచ్చే ప్రతి ఒక్కరికీ చేప మందు అందిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. మృగశిర కార్తె (Mrigasira Karthi) రోజున చేప తినాలి అనే ఒక ఆనవాయితీ ఉందని చెప్పారు. చేప మందు పంపిణీ చేస్తున్న బత్తిని కుటుంబానికి (Battini Family) కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీని మంత్రి తలసాని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చేప ప్రసాదం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే లక్షలాది మంది ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. బత్తిన హరినాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు ఇచ్చే చేప ప్రసాదంపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు. కరోనా కారణంగా మూడేండ్లపాటు పాటు చేప ప్రసాదం పంపిణీ చేయలేదన్నారు.
శుక్ర, శనివారాల్లో చేప మందును అందించనున్న నేపథ్యంలో ప్రభుత్వం పకడ్భందీగా ఏర్పాట్లు చేసింది. మత్స్యశాఖ ఆధ్వర్యంలో 1.5 లక్షల కొర్రమీను చేపలను అందుబాటులో ఉంచారు. అదనంగా మరో 75 వేల చేప పిల్లలతోపాటు.. అవసరమైతే మన్ని చేప పిల్లలను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా, చేప మందుకోసం గురువారం నుంచే దేశం నలుమూలల నుంచి ప్రజలు నగరానికి తరలివస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వంటి అనేక ప్రాంతాల నుంచి వ్యాధిగ్రస్తులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. మొత్తం 32 క్యూలైన్ల ద్వారా ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. నాంపల్లి గ్రౌండ్ పరిసరాల్లో 700 వరకు సీసీ కెమెరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండు రోజులపాటు దాదాపు 300 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసింది.
ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. 10వ తేదీవరకు నగరంలోని సికింద్రాబాద్ స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, ఎంజీబీఎస్, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్, శంషాబాద్ ఎయిర్పోర్టు వంటి ప్రాంతాల నుంచి దాదాపు 50 బస్సులను ఏర్పాటు చేశారు. అలాగే మరో 14 ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు 80 బస్సులను నడుపుతున్నారు.