హైదరాబాద్: ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయడంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూని చేస్తున్నదని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ లక్ష్యమా అని ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గోవా సహా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిన దుర్మార్గపు బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నించి అడ్డంగా దొరికారని విమర్శించారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు ఆశ చూపారని, ఇన్ని కోట్ల నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు అసహించుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికైనా రాజ్యాంగాన్ని గౌరవించి తమ పద్ధతిని మార్చుకోవాలి కమళం పార్టీ నేతలను సూచించారు.