హైదరాబాద్: బోనాల (Bonalu) ఉత్సవాలకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. ప్రజలు పండుగలను గొప్పగా జరుపుకోవాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆలోచన అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించామన్నారు. జూలై 16న హైదరాబాద్ ఓల్డ్ సిటీలో (Old City) జరుగనున్న బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సాలార్జంగ్ మ్యూజియంలో అధికారులు, స్థానిక ప్రజాప్రనిథులతో మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
వివిధ దేవాలయాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందన్నారు.
ప్రైవేట్ దేవాలయాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ (Telangana) అని వెల్లడించారు. ఓల్డ్ సిటీలోని ఆలయాలకు జులై 10న ఆర్థిక సహాయం పంపిణీ చేస్తామన్నారు.