హైదరాబాద్ : రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మత్స్య సంపద పెరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ సమావేశమైన కొత్త మత్స్యకార సంఘాల ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మత్స్యకారులకు లబ్ధి చేకూర్చుతోందని తెలిపారు. మత్స్యకారులకు చేప పిల్లలను ఉచితంగా ఇస్తున్నాం. తద్వారా మత్స్యకారుల కుటుంబానికి ఉపాధి లభిస్తుంది అని తెలిపారు. కేజ్ కల్చర్ పద్ధతి ద్వారా చేపల పంపంకం రాష్ట్రంలో చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇలా మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం , సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని స్పష్టం చేశారు. కొత్తగా వేయి ఫిషరీస్ సోసైటీల ఏర్పాటు ద్వారా వేల మంది మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందన్నారు. ఈ సభ్యత్వ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తాం అని మంత్రి తలసాని ప్రకటించారు.