హైదరాబాద్: పండుగలు గొప్పగా జరగాలి, ప్రజలు సంతోషంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. స్వరాష్ట్రంలో గణేశ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ గణనాథుడిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం తలసాని మాట్లాడుతూ.. హైదరాబాద్లో నిర్వహించే గణేశ్ నవరాత్రులు దేశంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. వేడుకలకు ప్రభుత్వ అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆదేశానుసారం బోనాలు, బతుకమ్మ, గణేష్ ఉత్సవాలు ఇలా అన్ని పండుగలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని పండుగలు నిధులు మంజూరు చేసి పండుగలు వైభవంగా జరుపుతున్నామని వెల్లడించారు. ఖైరతాబాద్ గణేశుడిని మట్టితో తయ్యారు చేసి అందరికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తామని మంత్రి అన్నారు.