హైదరాబాద్ : ఒకరు రక్తదానం చేస్తే.. మరొకరికి ప్రాణదానం చేసిన వారవుతారని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం సనత్ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆయన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 సంవత్సరాలవుతున్న సందర్భంగా శిబిరంలో 75 మంది రక్తదానం చేశారన్నారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రక్తాన్ని తలసేమియా బాధితులకు, ఇతర బాధితులకు అందించడం జరుగుతుందన్నారు.
అనేకమంది వీరుల త్యాగాల ఫలితంగానే విశాల భారతావని ఏర్పడిందని, స్వాతంత్ర పోరాట వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ నెల 8 నుంచి 22 వరకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో వజ్రోత్సవాలను నిర్వహిస్తుందని చెప్పారు. అందులో భాగంగానే ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రజల్లో జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంపొందించే విధంగా, పోరాట యోధులను స్మరించుకోనేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటి తరం వారిలో అనేక మందికి దేశం కోసం పోరాడిన వీరుల గురించి తెలియదని, పాఠశాల స్థాయి నుండే విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయతా భావాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహాత్మాగాంధీ చరిత్ను తెలియజేసేలా రూపొందించిన గాంధీ చిత్రాన్ని వజ్రోత్సవాల్లో ఉచితంగా ప్రదర్శిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న మన జాతీయ పతాకం తయారీలో కూడా ఎంతో మంది కృషి, శ్రమ ఉన్నదన్న విషయం కూడా చాలా మందికి తెలియదని చెప్పారు. 11 సార్లు పలు మార్పులు చేసిన అనంతరం 1947లో ఈ జాతీయ పతాకాన్ని తయారు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కోలన్ లక్ష్మి, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్, సంకేత్ సంస్థ నిర్వాహకులు మురళి, కాశీ, రాహుల్ చౌదరీ, లోకేష్, నాయకులు నరేందర్, సురేష్ గౌడ్, డాక్టర్ సౌమ్య, సరాఫ్ సంతోష్, సిరాజ్, ఫాజిల్, బాల్ రెడ్డి, రాజేష్, గోదాస్ కిరణ్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.