Minister Srinivas Yadav | చెరువులపై మత్స్యకారులకు పూర్తిహక్కులు కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా కోంటూరు వద్ద రూ.50లక్షల వ్యయంతో నిర్మించనున్న ఫిష్మార్కెట్కు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. 200 మంది మత్స్యకారులకు నూతన సభ్యత్వ కార్డులను మంత్రి అందజేశారు. అంతకు ముందు కలెక్టరేట్ వద్ద ఆరుగురు లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో మత్స్యకారులు పూర్తిగా నిరాధరణకు గురయ్యారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం మత్స్యకారులు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మత్స్యకారులకు సబ్సిడీపై వివిధ రకాల వాహనాలు అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. అదేవిధంగా మత్స్యకారులు చేపలను అమ్ముకునేందుకు మార్కెట్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు.
మత్స్యకారులకు ఆదాయ మార్గాలను పెంచాలనే ఆలోచనతో మహిళా మత్స్యకారులకు చేపల వంటకాలపై ఉచితంగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. మృగశిర కార్తె సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో మూడు రోజులపాటు ఫిఫ్ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించి ప్రజలకు వివిధ రకాల చేపల వంటకాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలతో రాష్ట్రంలో మత్స్య సంపద భారీ ఎత్తున పెరిగిందని, ప్రభుత్వ ఫలాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
అందుకోసం నూతనంగా లక్ష మంది మత్స్యకారులకు సోసైటీల్లో సభ్యత్వాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. స్థానిక మత్స్యకారుల సౌకర్యార్థ్యం కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పద్మాదేవేందరెడ్డి మంత్రిని కోరగా.. చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, మత్స్య శాఖ జిల్లా అధికారి రజినీ, డీవీహెచ్ఓ వెంకట్, ఆర్డీవో అంబదాసు తదితరులు పాల్గొన్నారు.