హైదరాబాద్ : నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై బీజేపీ నేతలు దాడికి దిగడం దారుణమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్తో కలిసి మంత్రి మంగళవారం ఎంపీ కవితను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వజ్రోత్సవాల ముగింపు వేడుకలు జరుగుతున్న సమయంలో బీజేపీ నేతలు కవిత ఇంటిపై రావడం దుర్మార్గమని, హేయమైన చర్యని మండిపడ్డారు.
బీజేపీ నేతలు, జిల్లా పార్టీ అధ్యక్షుడు రావడం సిగ్గుచేటన్నారు. మీ ఇంట్ల మీదికి రావాలంటే పెద్ద విషయం కాదని, మా టీఆర్ఎస్ సైన్యం ఎంతో తెలుసా? అన్న ఆయన.. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నిన్న ముట్టడికి కారణం ఏంటని..? ఆ అంశంపై మీకు అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. ఒక ఎంపీ మాట్లాడిన మాటలను.. తప్పుడు ఆరోపణలను పట్టుకొని బాధ్యత గల వ్యక్తి ఇంటికి రావడం సమంజసం కాదన్నారు.
వేలాది సైన్యం తమకూ ఉందని, మీ ఇండ్ల మీద దాడులు, పార్టీ ఆఫీస్ల మీదకు వస్తే పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. సంఘీభావం చెప్పడానికి వచ్చిన మా కార్యకర్తలు.. బీజేపీ ఆఫీస్ ముట్టడికి వెళ్తామని అని ఉంటున్నారని, మాకు సంస్కారం ఉందని.. మా పార్టీ అధినేత అది మాకు నేర్పలేదన్నారు. బీజేపీ నేతలు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.