హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం ఏమిచ్చిందో శ్వేత పత్రం ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్లో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాని మోదీకి వీడోలు పలికిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పరేడ్ గ్రౌండ్లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని తెలంగాణలోని దేవాలయాల గురించి మాట్లాడారని, దేవాలయాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులు ఇచ్చారో స్పష్టం చేయాలని అన్నారు. కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలని తమ ప్రభుత్వం అనేక ఆందోళనలు చేసిందని గుర్తుచేశారు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రధానమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు.
9 ప్రశ్నలకు సమాధానమేది?
సీఎం కేసీఆర్ నాయకత్వంలో సింగిల్ ఇంజిన్ సరార్తోనే తెలంగాణలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, మీ డబుల్ ఇంజిన్ రాష్ట్రాల్లో ఈ అభివృద్ధి ఉన్నదా? అని తలసాని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ అడిగిన 9 ప్రశ్నలకి మోదీ ఒక సమాధానం కూడా చెప్పలేదని విమర్శించారు. అమిత్ షా కూడా ఇష్టానుసారంగా మాట్లాడారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం 90 వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసి నోటిఫికేషన్లను జారీ చేస్తున్నదని, ఎనిమిదేండ్లలో కేంద్రం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో చెప్పాలని నిలదీశారు. కిషన్రెడ్డి మూడేండ్ల నుంచి నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిని చూసి కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు ఎంతో ఎంజాయ్ చేశారని మంత్రి తలసాని తెలిపారు.