హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి దేశ వ్యాప్త ఎన్నికలకు బీజేపీ సిద్ధమా అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. అధికారంలో ఉన్నాం కదా అని ఏదైనా మాట్లాడుతామంటే కుదరదని చెప్పారు. కేంద్రమంత్రి హోదాలో అమిత్ షా అలా మాట్లాడటం సరికాదన్నారు. సనత్నగర్ బన్సీలాల్పేటలో డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. గుజరాత్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. కళ్లుండి చూడలేని కబోదులు బీజేపీ నాయకులు అని విమర్శించారు. ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పారు.
పేదల సొంతింటి కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారని చెప్పారు. కేసీఆర్ ముందుచూపుతోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇండ్లను పకడ్బందీగా కేటాయిస్తున్నామని, ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని వెల్లడించారు. అబద్దాల వలస పక్షులకు చెంపపెట్టులా డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తున్నామని చెప్పారు. బండ మైసమ్మ నగర్లో బస్తీ దవాఖానా, అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.
తెలంగాణకు బీజేపీ ఏం ఇచ్చిందో అమిత్ షా చెప్పాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ను ఎదుర్కొనేందుకు బండి సంజయ్ చాలన్న అమిత్ షా.. తెలంగాణకు ఎందుకొచ్చారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అప్పులు ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు. ప్రధాని మోదీ దేశంలోని సంపదను అదాని, అంబానీలకు దోచి పెడుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని చెప్పారు.
ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించామని చెప్పారు. బస్తీలను ఖాళీ చేయించి కొత్త ఇండ్లు కట్టించడం కష్టమైన పని అన్నారు. గతంలో నిత్యం కరెంటు కోతలు ఉండేవి, ఇప్పుడు నిరంతర కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. రూ.200 ఉన్న పింఛన్ను రూ.2 వేలు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. పేదల మొహంలో చిరునవ్వు చూడటమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. బండమైసమ్మ డబుల్ బెడ్ ఇండ్ల లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.