హైదరాబాద్ : దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్.. ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అయ్యారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం సికింద్రాబాద్ హరిహర కళాభవన్ ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు వృద్ధులు, వితంతువులకు రూ.200, వికలాంగులకు రూ.500 పెన్షన్ ఇచ్చేవారని గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతువులకు అందించే ఆర్థిక సహాయాన్ని రూ.2016, వికలాంగులకు రూ.3016 పెంచినట్లు వివరించారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 10లక్షల మంది అర్హులకు ప్రభుత్వం నూతనంగా పెన్షన్లు మంజూరు చేసిందన్నారు.
హైదరాబాద్ జిల్లాకు 77,695 నూతన పెన్షన్లు మంజూరయ్యాయని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని పెంచిన తర్వాత లబ్ధిదారులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. పెన్షన్ డబ్బుల కోసం లబ్ధిదారులు అక్కడా.. ఇక్కడా తిరిగే వారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు చెప్పారు. పేదలకు వైద్యం అందించేందుకు బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. కరోనా చికిత్సకు కేరాఫ్గా గాంధీ హాస్పిటల్ నిలిచిందన్నారు. అలాగే పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసిందని, ఉచితంగా విద్య, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లను అందించడమే కాక.. నాణ్యమైన భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి వెంకట్, కార్పొరేటర్లు మహేశ్వరి, హేమలత, మాజీ కార్పొరేటర్లు ఆకుల రూప, ఉప్పల తరుణి, తహసీల్దార్లు శైలజ, అయ్యప్ప పాల్గొన్నారు.