Kodangal | సిద్దిపేట, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట వెటర్నరీ కళాశాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కన్ను పడింది. దానిని తన నియోజకవర్గానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కళాశాల పనులు ఇప్పటికే ప్రారంభం కాగా, దీనికి కేటాయించిన రూ. 100 కోట్ల నిధులను మళ్లించాలని సంబంధితశాఖకు సీఎం ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. హరీశ్రావు విజ్ఞప్తితో కేసీఆర్ ప్రభుత్వం సిద్దిపేట కలెక్టరేట్ సమీపంలో పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విద్యాలయం (వెటర్నరీ కళాశాల) మంజూరు చేసింది. 30 ఎకరాల విస్తీర్ణంలో కళాశాల నిర్మాణం కోసం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం రూ. 180 కోట్లు మంజూరు చేశారు. నిరుడు మే 7న అప్పటి మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్ భూమిపూజ చేశారు.
రూ. 100 కోట్లు కేటాయించడంతో పనులు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్, కోరుట్ల, వరంగల్లో మూడు పశువైద్య కళాశాలలు ఉన్నాయి. ఈ మూడు కళాశాలల్లో 240 మంది మాత్రమే చదువుకొనే వీలుండగా, సిద్దిపేట కళాశాల అందుబాటులోకి వస్తే మరో 80 మంది విద్యార్థులకు ప్రవేశాలు లభించి ఉండేవి. ఈ నేపథ్యంలో 2024 నుంచి ఇక్కడ తరగతులు ప్రారంభించాలని కూడా నాటి ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ సర్కారు మాత్రం ఇప్పుడీ కళాశాలను కొడంగల్ నియోజకవర్గానికి తరలించాలని యోచిస్తున్నది. అందులో భాగంగా 25 మంది బోధన, బోధనేతర సిబ్బంది నియామకాన్ని నిలిపివేసింది. పనులు చేపట్టవద్దంటూ అంతర్గతంగా అధికారులకు ఆదేశాలు కూడా వెళ్లినట్టు తెలిసింది. దీంతో రెండునెలలుగా పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే చందంగా తయారయ్యాయి.
ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్రెడ్డి తన నియోజకవర్గమైన కొడంగల్పై ప్రత్యేక దృష్టిపెట్టారు. అభివృద్ధి పనుల కోసం రెండు నెలల్లోనే వేల కోట్లు మళ్లించారు. వికారాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజీ, కొడంగల్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా మెడికల్ కాలేజీతోపాటు ఇంజినీరింగ్, జూనియర్, డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ క్రమంలో వేలకోట్ల నిధులను కొడంగల్కు తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 3,695 కోట్లు కేటాయించింది.
వీటిలో రూ. 2,945 కోట్లను కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీతోపాటు నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీల కోసం రూ. 224 కోట్లతో పరిపాలన అనుమతులు కూడా ఇచ్చింది. నియోజకవర్గంలో పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధికి రూ. 204 కోట్లు, ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధి కోసం రూ.322 కోట్లు ప్రభుత్వం మంజూరుచేసింది. ఈ నెల 17 లేదంటే 18న కొడంగల్లో పర్యటించనున్న సీఎం రేవంత్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.